logo

జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానిది హత్యా... ఆత్మహత్యా..?

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమాని శ్యామ్‌ మణికంఠ రామ్‌ప్రసాద్‌ (21) మృతిపై ఇంకా అనుమానాలు వీడలేదు.

Updated : 29 Jun 2023 09:46 IST

మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు

రావులపాలెం పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమాని శ్యామ్‌ మణికంఠ రామ్‌ప్రసాద్‌ (21) మృతిపై ఇంకా అనుమానాలు వీడలేదు. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రులో ఈ నెల 24న శ్యామ్‌ ఉరివేసుకుని మృతి చెంది ఉండటం వెలుగుచూసిన విషయం తెలిసిందే. చేతిపై బ్లేడుతో గాయాలు ఉండటం, ఆత్మహత్యకు ముందు శ్యామ్‌ మాట్లాడినట్లుగా ఉన్న సెల్ఫీ వీడియోలో మరోవ్యక్తి మాటలు కూడా వినిపిస్తుండటంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. శ్యామ్‌ చనిపోయే ముందు 24న ఫోన్‌లో ఎవరెవరితో మాట్లాడాడనే వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఏవైనా సందేశాలు పంపాడా అని ఆరా తీస్తున్నారు. మోడేకుర్రుతో పాటు స్వగ్రామమైన కొప్పిగుంట, ఇతర ప్రాంతాల్లో విభేదాలు ఉన్నాయా?.. ప్రేమ వ్యవహారం ఏదైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఆయన రాసుకున్న పలు కాగితాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. శ్యామ్‌ మృతిపై తల్లిదండ్రులు, సోదరి కొత్తపేట డీఎస్పీ రమణకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని