Hyderabad: హైదరాబాద్‌ కేంద్రంగా ఆన్‌లైన్‌ వ్యభిచారం.. ముఠా ఉచ్చులో 14,190 మంది మహిళలు

దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ వ్యభిచార ముఠా గుట్టును సైబరాబాద్‌ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా ఉచ్చులో ఏకంగా 14,190 మంది మహిళలు, యువతులు చిక్కుకున్నట్టు  సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వివరించారు.

Updated : 06 Dec 2022 19:07 IST

హైదరాబాద్‌: అంతర్జాతీయ ఆన్‌లైన్‌ వ్యభిచార ముఠా గుట్టును సైబరాబాద్‌ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా ఉచ్చులో విదేశాలకు చెందిన మహిళలతో పాటు వివిధ నగరాలకు చెందిన యువతులు కూడా చిక్కుకున్నారు. మహిళలు, యువతులకు నిర్వాహకులు ఎండీఎంఏ మాదకద్రవ్యాలు అలవాటు చేయడంతో పాటు, బాధిత మహిళల ద్వారా విటులకు కూడా మాదక ద్రవ్యాలు సరఫరా చేయడం ద్వారా మత్తు దందా నిర్వహిస్తున్నట్టు  పోలీసుల దర్యాప్తులో తేలింది. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌ ప్రాంతానికి చెందిన అర్నవ్‌ ఈముఠాకు నాయకుడిగా ఉంటూ దందా కొనసాగిస్తున్నట్టు సైబరాబద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు. 

గుట్టు చప్పుడు కాకుండా వెబ్‌సైట్లు, వాట్సాప్‌ గ్రూప్‌ల ద్వారా ఈ ముఠా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ముఠా ఉచ్చులో ఏకంగా 14,190 మంది మహిళలు, యువతులు చిక్కుకున్నట్టు  సీపీ వివరించారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, దిల్లీ, ముంబయి, కోల్‌కతా, అస్సాం, బంగ్లాదేశ్‌, నేపాల్‌, థాయిలాండ్‌, ఉజ్బెకిస్తాన్‌, రష్యాకు చెందిన వారని వెల్లడించారు. నిందితులు పలు ప్రాంతాల్లో కాల్‌సెంటర్లు సైతం ఏర్పాటు చేసినట్టు సీపీ వివరించారు. నిర్వాహకుల దందా మొత్తం ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారని, ప్రధాన నిందితుడు అనుమానం రాకుండా తన ఫోటో కూడా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడినట్టు చెప్పారు. ఈముఠాలోని మొత్తం 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 39 కేసులు నమోదు చేసి నిందితుల వద్ద నుంచి 34 చరవాణులు, 3 కార్లు, ల్యాప్‌టాప్‌, 2.5 గ్రాముల ఎండీఎంఏ మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. యువతులు, మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఈ తరహా ముఠాల ఉచ్చులో చిక్కుకోవద్దని సీపీ సూచించారు. అనుమానం వస్తే డయిల్‌ 100, వాట్సప్‌ నెంబర్‌ 9490617444 కు ఫిర్యాదు చేయాలని స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని