పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి

`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.

Updated : 25 Apr 2024 05:35 IST

నలుగురికి తీవ్రగాయాలు

ఈపూరు, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల వివరాల ప్రకారం.. బుధవారం వినుకొండ తెదేపా అభ్యర్థి జీవీ ఆంజనేయులు నామినేషన్‌ కార్యక్రమానికి ఇనుమెళ్ల గ్రామానికి చెందిన తెదేపా శ్రేణులు తమ వాహనాల్లో బయల్దేరడానికి సిద్ధమయ్యారు. ఇంతలోనే వైకాపాకు చెందిన ఒక యువకుడు ద్విచక్రవాహనంపై వచ్చి తెదేపా వారి వాహనాలను ఢీకొట్టాడు. అంతటితో ఆగకుండా గొడవకు దిగడంతో తెదేపా కార్యకర్తలు చేయి చేసుకున్నారు. గ్రామపెద్దలు సర్దిచెప్పడంతో వారందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆంజనేయులు నామినేషన్‌ కార్యక్రమం ముగించుకొని తెదేపా కార్యకర్తలు సాయంత్రానికి ఊర్లోకి వచ్చారు. ఉదయం జరిగిన గొడవను మనసులో పెట్టుకొన్న వైకాపా వర్గీయులు ప్రణాళిక ప్రకారం కత్తులు, రాళ్లు, కర్రలతో వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో తెదేపాకు చెందిన చింతల సీతారామాంజినేయులు, చింతల కుమారి, నాగార్జున, చలమయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. క్షతగాత్రులను నరసరావుపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళలు ఆందోళన చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు