Hyd Airport Metro: భాగ్యనగరానికి మరో మణిహారం.. ఎయిర్‌పోర్టు మెట్రోకు కేసీఆర్‌ శంకుస్థాపన

భాగ్యనగరంలో మరో భారీ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండో దశకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు.

Updated : 09 Dec 2022 15:01 IST

హైదరాబాద్‌: భాగ్యనగరంలో మరో భారీ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండో దశకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. నాగోల్‌-రాయదుర్గం కారిడార్‌-3కు కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు నిర్మించే ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ మెట్రోకు మైండ్‌స్పేస్‌ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన పునాదిరాయి వేశారు. కాసేపట్లో అప్పా కూడలిలోని పోలీసు అకాడమీ మైదానంలో బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తారు. శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

 

ఎయిర్‌పోర్టు మెట్రో మార్గం ఇలా..

మైండ్‌స్పేస్‌ కూడలి నుంచి 0.9 కి.మీ. దూరంలో కొత్తగా నిర్మించే రాయదుర్గం ఎయిర్‌పోర్ట్‌ స్టేషన్‌తో విమానాశ్రయ మెట్రో ప్రారంభం అవుతుంది. ఇక్కడి నుంచి బయోడైవర్సిటీ కూడలిలోని రెండు ఫ్లైఓవర్లను దాటుకుని నేరుగా కాజాగూడ చెరువు పక్క నుంచి ఎలైన్‌మెంట్‌ వెళ్తుంది. కాజాగూడ నుంచి కుడివైపు తిరిగి నానక్‌రాంగూడ కూడలి, అక్కడి నుంచి ఓఆర్‌ఆర్‌ పక్క నుంచి నార్సింగి, అప్పా కూడలి, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌, విమానాశ్రయ కార్గో మీదుగా విమానాశ్రయంలోకి నేరుగా చేరుకునేలా జీఎంఆర్‌ సమన్వయంతో ఎలైన్‌మెంట్‌ రూపొందించారు.

ప్రత్యేకతలివీ..

🚇 విమానాశ్రయ మెట్రోలో ఇప్పుడున్న మెట్రో కంటే మరింత అధునాతన సౌకర్యాలు కల్పిస్తారు.

🚇 ఎక్కువ మంది కూర్చుని ప్రయాణించేలా సీట్లు (ఛైర్‌కార్లు) ఉంటాయి.

🚇 ప్లాట్‌ఫాంపై భద్రత కోసం అద్దాలతో కూడిన స్క్రీన్‌ విండోస్‌ ఏర్పాటు చేస్తారు. స్టేషన్‌లో మెట్రోరైలు ఆగిన తర్వాత కోచ్‌ల తలుపులు తెరచుకునే సమయంలోనే ఇవి తెరచుకుంటాయి.

🚇 రైళ్లు వేగంగా వెళ్లేందుకు వీలుగా ఏరో డైనమిక్స్‌లో మార్పు చేస్తారు. తేలికపాటి స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, అల్యూమినియం కోచ్‌లు ఉంటాయి.

🚇 కారిడార్‌లో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో స్టేషన్లు నిర్మిస్తారు. వాటికి ప్రయాణికులు చేరుకునేలా స్కైవాక్‌లు ఏర్పాటు చేస్తారు.

🚇 స్టేషన్లలో విమాన రాకపోకల సమాచారం తెలిపే బోర్డులు ఏర్పాటు చేస్తారు. సీఐఎస్‌ఎఫ్‌ పోలీసుల సమన్వయంతో లగేజీ తనిఖీలు చేస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని