logo

వీధులు తవ్వేసి.. విధికి వదిలేసి

నాలాలు, కాలువలు, పైపులైన్ల తవ్వకం పనుల్లో జీహెచ్‌ఎంసీ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. గుంతలను తవ్వి నెలల తరబడి అలాగే ఉంచుతోంది.

Published : 25 Jan 2023 01:47 IST

నాలాలకు తీసిన కాలువలతో ప్రమాదాలు
బారికేడ్లు, రక్షణ చర్యల్లో జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం

న్యూమిర్జాలగూడలో ఆల్బర్ట్‌ పడిపోయిన గుంత

ఈనాడు, హైదరాబాద్‌, గౌతంనగర్‌, న్యూస్‌టుడే: నాలాలు, కాలువలు, పైపులైన్ల తవ్వకం పనుల్లో జీహెచ్‌ఎంసీ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. గుంతలను తవ్వి నెలల తరబడి అలాగే ఉంచుతోంది. నోళ్లు తెరచుకున్న కాలువల్లో స్థానికులు జారిపడుతున్నారు. గాయాలపాలవుతున్నారు. వర్షాకాలంలో ముంపు సమస్య తలెత్తుతోంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం చోటు చేసుకుంటోంది. మంగళవారం మల్కాజిగిరిలోని న్యూ మిర్జాలగూడలో చోటు చేసుకున్న దుర్ఘటనే అందుకు నిదర్శనం. సాఫీగా ఉన్న రోడ్డుపై గుంతను తవ్వి అలాగే వదిలేయడంతో.. స్థానికుడు అందులో పడి మృత్యువాతపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లపై మృతుల కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించగా, బల్దియా యంత్రాంగం ఒత్తిడితో ఫిర్యాదుపై వెనక్కి తగ్గినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నగరవ్యాప్తంగా అంతే..: నగర వ్యాప్తంగా జీహెచ్‌ఎంసీ రెండేళ్ల క్రితం నాలాల నిర్మాణ పనులు చేపట్టింది. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎస్‌ఎన్‌డీపీ)లో భాగంగా కిలోమీటర్ల మేర బాక్స్‌ డ్రెయిన్లను నిర్మిస్తోంది. పనులు గతేడాది డిసెంబరు నాటికి పూర్తవ్వాలి. వేర్వేరు కారణాలతో ఇంకా కొనసాగుతున్నాయి. మార్చి నెలాఖరుకు పూర్తవుతాయని ఇంజినీర్లు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎస్‌ఎన్‌డీపీ ప్రాజెక్టులో భాగంగా మొదట ప్రారంభమైన హుస్సేన్‌సాగర్‌ వరద నాలా పనులే నత్తనడకన సాగుతున్నాయి. అశోక్‌నగర్‌ వద్ద కల్వర్టు విస్తరణ పనులు మూడేళ్లుగా పూర్తవట్లేదు. అశోక్‌నగర్‌, హిమాయత్‌నగర్‌ మధ్యలో భూసేకరణ చేపట్టలేక జీహెచ్‌ఎంసీ చేతులెత్తేసింది. ఫీవర్‌ ఆస్పత్రి నుంచి అంబర్‌పేట వరకు చేపట్టాల్సిన నాలా పనులు సైతం అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌, వనస్థలిపురం, కాప్రా, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. మీటర్ల కొద్దీ నాలా కోసం వీధుల్లోని రోడ్లను గుత్తేదారులు లోతుగా తవ్వారు. వాటిపై శ్లాబులు నిర్మించడంలో జాప్యం ప్రదర్శిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు