Nijjar murder: నిజ్జర్‌ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్‌ ఐఎస్‌ఐ’తో సంబంధాలు..!

Nijjar murder: ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య కేసులో కెనడా అరెస్టు చేసిన ముగ్గురు నిందితులకు పాకిస్థాన్‌ ఐఎస్‌ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది.

Published : 04 May 2024 11:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసు (Nijjar murder)లో నిందితులుగా పేర్కొంటూ కెనడా (Canada) పోలీసులు ముగ్గురు భారతీయులను అరెస్టు చేశారు. ఎడ్మంటన్‌ ప్రాంతంలో నివాసముంటున్న కరణ్‌ప్రీత్‌ సింగ్‌ (28), కమల్‌ప్రీత్‌ సింగ్‌ (22), కరణ్‌ బ్రార్‌ (22)లను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీసులు అధికారిక ప్రకటన చేస్తూ వారి ఫొటోలను విడుదల చేశారు.

వీరిపై ఫస్ట్‌ డిగ్రీ హత్య కేసు అభియోగాలు మోపినట్లు వెల్లడించారు. ‘‘ఈ ముగ్గురు హిట్ స్క్వాడ్‌ సభ్యులు. ఈ ముఠాపై అధికారులు గత కొన్ని రోజులుగా నిఘా పెట్టారు. దర్యాప్తు ఇక్కడితో ముగియలేదు. ఈ హత్య ఘటనలో మరింత మంది ప్రమేయం ఉన్నట్లు మాకు తెలిసింది. ఆ దిశగా దర్యాప్తు చేపడుతున్నాం. నిందితులందరికీ గుర్తించి అరెస్టు చేస్తాం’’ అని కెనడా పోలీసులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

వారంలో అంగీకరిస్తే సరే.. లేకపోతే రఫాపై దండయాత్రే

కాగా.. ఈ ముగ్గురికి పాకిస్థాన్‌ ఐఎస్‌ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ‘‘కొంతమంది గ్యాంగ్‌స్టర్లు కెనడాలో కూర్చుని భారత్‌లో తమ నేర కార్యకలాపాలను సాగిస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నిందితులుగా పేర్కొన్న చాలా మంది ఆ దేశంలో స్థిరపడ్డారు. భారత వ్యతిరేక, ఖలిస్థానీ అనుకూల కార్యకలాపాలు సాగించేందుకు వారికి పాక్‌ ఐఎస్‌ఐ నుంచి నిరంతరం నిధులు అందుతున్నాయి. దీని గురించి మేం చాలా సార్లు అనేక ఆధారాలు ఇచ్చినా.. కెనడా ప్రభుత్వం గానీ, పోలీసుల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. ఇప్పుడు తాజా కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత ప్రభుత్వంపై కెనడా నిందలు మోపుతోంది. అరెస్టయిన ఆ ముగ్గురు డ్రగ్స్‌ దందా చేస్తున్నారని, వారికి ఐఎస్‌ఐతో సంబంధాలున్నాయని మాకు తెలిసింది’’ అని సదరు వర్గాలు మీడియాకు వివరించాయి.

2023 జులై 18న బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో గురుద్వారా వెలుపల నిజ్జర్‌ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ హత్య వెనుక భారత్‌ ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు భగ్గుమన్నాయి. ఈ ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. మరోవైపు, నిజ్జర్‌ హత్య దృశ్యాలు ఇటీవల కెనడా మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని