TS Assembly: దేశం చూపు కేసీఆర్‌ వైపు.. సంక్షేమంలో మాకు తిరుగులేదు: కేటీఆర్‌

కేసీఆర్‌ అధికారంలోకి రాకముందు విద్యుత్‌ ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించుకోవాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రసంగానికి కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు.

Updated : 04 Feb 2023 19:26 IST

హైదరాబాద్: దేశానికి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధికి తెలంగాణ దిక్సూచిగా ఉందని చెప్పారు. తెలంగాణ శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ముగిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత, భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన విమర్శలపై కేటీఆర్‌ స్పందించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు మాట్లాడిన మాటలు కేంద్రానికి వత్తాసు పలికేలా ఉన్నాయని కేటీఆర్‌ విమర్శించారు. రఘునందన్ రావు న్యాయవాది.. న్యాయవాదుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నందున ఆయన భారాసకు ఓటు వేయాలని కేటీఆర్‌ అన్నారు.

‘‘దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ ఎదిగింది. రాష్ట్రంలో కరెంట్ కష్టం లేదు.. తాగునీటి తిప్పలు లేవు. సంక్షేమంలో ప్రభుత్వానికి తిరుగులేదు. దేశ ప్రజల చూపు కేసీఆర్‌ వైపు ఉంది. తెలంగాణతో కేసీఆర్‌కు ఉన్న బంధాన్ని ఎవరూ విడదీయలేరు. మా ప్రభుత్వం కుటుంబపాలనే.. 4 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు మా కుటుంబమే. రాష్ట్రంలో నిధుల వరద పారుతోంది. నియామకాల కల సాకారం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అత్యుత్తమ 20గ్రామ పంచాయతీల్లో.. తొమ్మిది తెలంగాణలోనే ఉన్నాయి. పల్లెపల్లెకు నిధులు పంపిణీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది. దేశంలోని వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. 2022లో 65 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. 65లక్షల మంది రైతు ఖాతాల్లో ₹65వేల కోట్లు జమ చేశాం. ఐక్యరాజ్యసమితి కూడా రైతు బంధు పథకాన్ని ప్రశంసించింది. భాజపా తెచ్చిన నల్ల చట్టాల ద్వారా 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. అసలు మోటార్లకు మీటర్లు ఎందుకు?’’

పెండింగ్‌ ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చాం..

కేసీఆర్‌ అధికారంలోకి రాకముందు విద్యుత్‌ ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించుకోవాలి. అక్కడ గుజరాత్‌లోని పరిశ్రమలకు పవర్‌ హాలిడేలు ఇస్తున్నారు. ఇక్కడ పెండింగ్‌ ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చాం. సిరిసిల్ల జిల్లాలో భూగర్భ జలాలు 6మీటర్ల మేర పెరిగాయి. సాగునీటి రంగంలో తెలంగాణ గొప్ప విజయాలు సాధించింది. మాంసం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. జాతీయ తలసరి సగటు మాంసం వినియోగం దేశంలో 5 కేజీలు ఉంటే తెలంగాణలో 21 కేజీలు ఉంది. అంగన్వాడీ ఉద్యోగులకు అత్యధిక వేతనం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. దేశానికి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా ఉంది’’ అని కేటీఆర్‌ వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని