logo

నాడు మామ.. నేడు అల్లుడు

మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో ఆడబిడ్డ పోటీ చేస్తుంటే కాంగ్రెస్‌ నేతలు ఓర్వలేకపోతున్నారని, ఓడించేందుకు నాడు మామ, నేడు అల్లుడు కుట్ర చేస్తున్నారని భాజపా లోక్‌సభ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు.

Updated : 30 Apr 2024 06:38 IST

ఆడబిడ్డ గెలవకుండా కాంగ్రెస్‌ కుట్రలు : డీకే అరుణ 

ప్రచారంలో మాట్లాడుతున్న భాజపా మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ

మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో ఆడబిడ్డ పోటీ చేస్తుంటే కాంగ్రెస్‌ నేతలు ఓర్వలేకపోతున్నారని, ఓడించేందుకు నాడు మామ, నేడు అల్లుడు కుట్ర చేస్తున్నారని భాజపా లోక్‌సభ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వెంకటాపూర్‌, చిన్నదర్పల్లిలో సోమవారం ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ పార్టీ పెద్దమనిషిగా చెప్పే జైపాల్‌రెడ్డి కుట్రలు చేస్తే, నేడు ఆయన అల్లుడు రేవంత్‌రెడ్డి కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. ఆడబిడ్డ పోటీ చేస్తుంటే తట్టుకోలేని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో మహిళలకు ఎలా న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. తనను ఓడించడానికి కులాలు, మతాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. డీకే అరుణను రాజకీయంగా ఎదుర్కోలేకే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు అడగాలన్నారు. అమలు సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కినంత సునాయసంగా లోక్‌సభ ఎన్నికల్లో మభ్యపెడతామనుకుంటే కుదరదని, ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. భాజపా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, తప్పుదోవ పట్టించేందుకే కాంగ్రెస్‌ కుట్ర రాజకీయాలు చేస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని