logo

పెళ్లింట విషాదం..

వివాహం జరిగి మూడు రోజులు కాలేదు.. సంతోషంగా ద్విచక్ర వాహనంపై కొత్త దంపతులిద్దరు వెళ్లగా.. మృత్యురూపంలో దూసుకొచ్చిన లారీ నూతన వరుడిని బలి తీసుకుంది.

Updated : 01 May 2024 05:49 IST

రోడ్డు ప్రమాదంలో నవవరుడి దుర్మరణం

 వెంకటేశం

 చేగుంట: వివాహం జరిగి మూడు రోజులు కాలేదు.. సంతోషంగా ద్విచక్ర వాహనంపై కొత్త దంపతులిద్దరు వెళ్లగా.. మృత్యురూపంలో దూసుకొచ్చిన లారీ నూతన వరుడిని బలి తీసుకుంది. పెళ్లి సంబరంలో మునిగిన ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఈ విషాదకర ఘటన మాసాయిపేట మండలం రామంతాపూర్‌ వద్ద చోటుచేసుకుంది. చేగుంట ఎస్‌ఐ బాల్‌రాజు తెలిపిన వివరాలు.. చిన్నశంకరంపేట మండలం జంగరాయికి చెందిన ఎర్రోళ్ల వెంకటేశ్‌ (23)కు మాసాయిపేట మండలం పోతాన్‌పల్లికి చెందిన యువతితో ఈనెల 26న వివాహం జరిగింది. పెళ్లి, విందు వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. సోమవారం రాత్రి నిద్ర చేసేందుకు దంపతులిద్దరూ కొత్త ద్విచక్రవాహనంపై జంగరాయి నుంచి నూతన వధువు స్వగ్రామం పోతాన్‌పల్లికి బయల్దేరారు. రామంతాపూర్‌ వద్ద వీరు వెళ్తున్న బైక్‌ను వెనక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో వారిద్దరు కింద పడిపోయారు. వెంకటేశ్‌ తలపై నుంచి అదే లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను తూప్రాన్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు గ్రామంలో తన సోదరుడు మహిపాల్‌తో కలిసి వ్యవసాయం చేస్తూ ఆటో నడిపించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో, కుటుంబంలో విషాదం నెలకొంది. ఇంట్లో కుటుంబసభ్యులు, బంధుమిత్రుల రోదనలు కలిచివేశాయి. మిత్రులు కన్నీటి పర్యంతం అయ్యారు. మృతుడి తల్లి సౌందర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని