logo

జిల్లా.. చోరీల ఖిల్లా

జిల్లాలో దొంగతనాలు పెరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒకప్రాంతంలో చోరులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇంటికి తాళం వేస్తే ఉన్నదంతా మాయం చేస్తున్నారు.

Published : 29 May 2023 05:29 IST

రెండు నెలల వ్యవధిలో రూ.2 కోట్లు దొంగలపాలు

కావలిలో ఇటీవల జరిగిన చోరీలో చెల్లాచెదురుగా పడేసిన వస్తువులు

న్యూస్‌టుడే, నెల్లూరు(నేర విభాగం): జిల్లాలో దొంగతనాలు పెరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒకప్రాంతంలో చోరులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇంటికి తాళం వేస్తే ఉన్నదంతా మాయం చేస్తున్నారు. రెండు నెలల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా రూ.2కోట్లకు పైగా విలువైన సొత్తు దొంగలపాలైంది. చోరీలు అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిఘా, సాంకేతికత దొంగలను కట్టడి చేయలేకపోతున్నాయి. నెల వ్యవధిలోనే వరుస ఘటనలు జరుగుతున్నా నియంత్రణ చర్యలు కనిపించడంలేదు. నగరంలోని 6 పోలీసుస్టేషన్ల పరిధిలో నిత్యం చోరీలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతూనే ఉన్నాయి. మోటారు సైకిళ్లు, కార్లు ఎత్తుకెళ్లిపోతున్నా పోలీసులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. జైలు నుంచి విడుదలైనవారే చోరీలకు పాల్పడుతున్నారని దర్యాప్తులో తేలింది. కేసులు వందల్లో నమోదవుతున్నా ఛేదించినవి మాత్రం తక్కువగా ఉంటున్నాయి.

రాత్రి గస్తీ ఏదీ..?

ప్రతి పోలీసుస్టేషన్‌ పరిధిలో రాత్రిబీట్‌ ఉంటుంది. ఒక బీట్‌కు కానిస్టేబుల్‌, హోంగార్డు ఉంటారు. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నిర్వహించాలి.  పర్యవేక్షణకు అధికారులు ఉంటారు. బీట్‌ సిబ్బందిని ఉత్సాహపరిచేందుకు, తనిఖీలు చేసేందుకు ‘చాయ్‌ విత్‌ బీట్స్‌’ కార్యక్రమం గతంలో జరిగింది. ప్రస్తుతం ఇది సక్రమంగా సాగడంలేదనే విమర్శలు ఉన్నాయి. నగరంలో ఇటీవల అర్ధరాత్రి ఆర్టీసీ బస్సును కొందరు మందుబాబులు ఆపి గందరగోళం సృష్టించారంటే బీట్‌ వ్యవస్థ ఎలా ఉందో తెలుస్తోంది. చోరీల నియంత్రణకు నిరంతరం పాత నేరస్థులపై దృష్టి సారించాలి. వారి కదలికలు పరిశీలిస్తుండాలి. సీసీఎస్‌ విభాగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలి. నేరాలతో కలిగే అనర్థాలు, ఇతరత్రా వాటిపై కారాగారంలో ఖైదీలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

* ఏప్రిల్‌ 16న కావలి బృందావనం కాలనీలో దొంగతనం జరిగింది. ఇంట్లో అందరూ ఉండగానే నగదు ఎత్తుకెళ్లిపోయారు.పోలీసుల అంచనా ప్రకారం రూ.కోటిన్నరకు పైగా సొత్తు చోరీ జరిగింది. ఆ కేసు దర్యాప్తులో ఉంది.

* నెల్లూరు ఎన్‌సీసీ కాలనీలోని ఒక ఇంట్లో అర్ధరాత్రి దుండగులు ప్రవేశించారు. కుటుంబీకులను నిర్బంధించారు. ఉన్నదంతా ఊడ్చేశారు. రూ.లక్షల్లోనే సొత్తు దొంగిలించారు. నెలలు గడుస్తున్నా కేసు కొలిక్కి రాలేదు.

* నెల్లూరు గ్రామీణ పోలీసు స్టేషన్‌పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. తాళం వేసిన ఇళ్లతోపాటు బంగారం దుకాణాల్లోనూ చోరీలకు పాల్పడుతున్నారు.

* తాజాగా కావలిలో పక్కపక్కనే ఉండే రెండిళ్లలో దుండగులు చొరబడి రూ.15 లక్షల సొత్తు అపహరించారు.

చర్యలు తీసుకుంటాం..

జిల్లాలో దొంగతనాలపై నిఘా ఏర్పాటుచేశాం. కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నిందితుల కదలికలపై దృష్టి సారిస్తున్నాం. త్వరలో దొంగలను పట్టుకుంటాం.

డాక్టర్‌ తిరుమలేశ్వరరెడ్డి, ఎస్పీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని