logo

బడుల బలోపేతానికి కసరత్తు

ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణలో ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ల పేరుతో మహిళా సంఘాల సభ్యులను భాగస్వాములను చేసి వారి సహకారంతోనే మౌలిక వసతులు కల్పించి బడుల బలోపేతానికి సర్కారు కృషి చేస్తోంది.

Published : 16 Apr 2024 06:10 IST

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతోనే పనులు చేయించాలని నిర్ణయం
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ విద్యావిభాగం

ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణలో ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ల పేరుతో మహిళా సంఘాల సభ్యులను భాగస్వాములను చేసి వారి సహకారంతోనే మౌలిక వసతులు కల్పించి బడుల బలోపేతానికి సర్కారు కృషి చేస్తోంది. పాఠశాల యాజమాన్య కమిటీల స్థానంలో ఇప్పటికే ఏఏపీసీలను నియమించిన విద్యాశాఖ వీటితో పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు నిధులు సైతం విడుదల చేసింది. బడులు పునఃప్రారంభమయ్యే నాటికి మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించించడంతో క్షేత్రస్థాయిలో ఇంజినీర్లు బడుల్ని సందర్శించి ప్రతిపాదనలు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

జిల్లా వ్యాప్తంగా 1156 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలున్నాయి. ఇందులో 792 బడుల్లో మరమ్మతులు చేయాల్సి ఉందని గుర్తించారు. ఇందులో 770 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఎన్నుకున్నారు. వీటిల్లో మరమ్మతులకు రూ.39.38 కోట్లు అవసరమని ఇంజినీరింగ్‌శాఖ అధికారులు తేల్చారు. ఏటా ప్రధానోపాధ్యాయులు యూడైస్‌-ప్లస్‌లో బడికి సంబంధించిన సౌకర్యాలు, అవసరాలపై వివరాలు నమోదు చేస్తారు. ఆ వివరాల ఆధారంగా ఆయా చోట్ల అవసరమైన పనులు చేపట్టేందుకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది.

అంచనాల తయారీలో నిమగ్నం

కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు ఇంజినీరింగ్‌శాఖ అధికారులతో సమావేశమై యూడైస్‌-ప్లస్‌ వివరాలిచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎన్ని నిధులు అవసరమో నివేదిక కోరారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో సౌకర్యాలు, మరమ్మతుల అంచనాల తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. మరుగుదొడ్లు, తాగునీరు, మరమ్మతులు, గదుల్లో విద్యుద్దీపాలు, బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాలు చేపట్టనున్నారు. ఇంజినీరింగ్‌ అధికారులు ఆయా పాఠశాలలను సందర్శించి అంచనాలు తయారు చేస్తున్నారు. యూడైస్‌ ప్లస్‌లో నమోదు చేసిన వివరాలను పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. జూన్‌ 10 నాటికి ఈ పనులను పూర్తిచేసి తర్వాత రెండోదశగా ‘మన ఊరు- మన బడి’ కింద ఎంపికైన పాఠశాలల్లో పెండింగ్‌ పనులు పూర్తి చేసేలా ఆదేశాలున్నాయి.


నాణ్యంగా చేపట్టేలా చర్యలు
- దుర్గాప్రసాద్‌, డీఈవో, నిజామాబాద్‌

ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పనకు సర్కారు నుంచి నిధులు వచ్చాయి. ఇప్పటికే అమ్మ ఆదర్శ కమిటీల నియామకం పూర్తయింది. ప్రస్తుతం మండలాల వారీగా పనులు గుర్తించడం, నిధులు కేటాయింపు పూర్తికావొస్తోంది. నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని