logo

జహీరాబాద్‌ బరిలో 19 మంది

నామినేషన్ల ఉప సంహరణ గడువు సోమవారం ముగియగా జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో 19 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

Updated : 30 Apr 2024 06:46 IST

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, పటాన్‌చెరు  : నామినేషన్ల ఉప సంహరణ గడువు సోమవారం ముగియగా జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో 19 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరించగా.. 40 మంది 68 సెట్లు దాఖలు చేశారు. పరిశీలన ప్రక్రియలో 14 మందికి చెందిన 19 సెట్లు తిరస్కరించారు. 26 మంది అభ్యర్థుల నామపత్రాలను ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇందులో ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉప సంహరించుకున్నారు. బరిలో ఉన్న వారిలో జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన వారు ముగ్గురు ఉండగా.. రిజిస్టర్డ్‌ రాజకీయ పార్టీలకు చెందిన వారు ఆరుగురు, మిగతా పది మంది స్వతంత్రులు. అభ్యర్థుల సంఖ్య 15 దాటడంతో ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో రెండు చొప్పున ఈవీఎంలు ఏర్పాటు చేయనున్నారు.

 ప్రధాన పార్టీల అభ్యర్థుల నేపథ్యం

గాలి అనిల్‌కుమార్‌ - భారాస : తెరాస ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగారు. 2009లో పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో టికెట్‌ ఆశించి భంగపడ్డారు. కాంగ్రెస్‌లో చేరి.. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో మెదక్‌ ఎంపీగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్‌ ఎమ్మెల్యేగా పోటీ కోసం కాంగ్రెస్‌ తరఫున కార్యక్రమాలు నిర్వహించారు. టికెట్‌ రాకపోవడంతో తిరిగి భారాస గూటికి చేరారు. ప్రస్తుతం ఎంపీగా గెలుపునకు ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
బీబీ పాటిల్‌ - భాజపా : స్వగ్రామం కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం సిర్పూర్‌. జహీరాబాద్‌ నుంచి రెండు పర్యాయాలు (2014, 2019లో) భారాస అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఇటీవల భాజపాలో చేరారు. ప్రస్తుతం భాజపా నుంచి పోటీ¨లో ఉన్నారు. మూడోసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
సురేష్‌ కుమార్‌ షెట్కార్‌ - కాంగ్రెస్‌ : 1992 నుంచి 1997 వరకు యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా, ఆ తర్వాత 2004 వరకు రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1994లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా నారాయణఖేడ్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం మొదటి ఎంపీగా విజయం సాధించారు. 2014లో జహీరాబాద్‌, 2018లో నారాయణఖేడ్‌ నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం జహీరాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. మరోసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టాలని చూస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని