logo

నేర వార్తలు

పొట్టంగి సమితి సుంకి-ఆంపావల్లి మార్గంలో మెట్టవలస వద్ద గురువారం రాత్రి కారు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. సుంకి ఔట్‌ పోస్ట్‌ పోలీసులు అందించిన వివరాల ప్రకారం..

Updated : 13 Aug 2022 06:41 IST

కారు బోల్తా: ఒకరి దుర్మరణం .. సిమిలిగుడ, న్యూస్‌టుడే: పొట్టంగి సమితి సుంకి-ఆంపావల్లి మార్గంలో మెట్టవలస వద్ద గురువారం రాత్రి కారు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. సుంకి ఔట్‌ పోస్ట్‌ పోలీసులు అందించిన వివరాల ప్రకారం...ఆంధ్రలోని పార్వతీపురం మన్యం జిల్లా మామిడి పల్లి చెందిన కరుడి సూర్యనారాయణ (30) అరకు వెళ్తుండగా మెట్ట వలస వద్ద ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం ఔట్‌ పోస్ట్‌ పోలీసులుకు సమాచారం రావడంతో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరీక్షకు తరలించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు..  ఖరగ్‌పూర్‌, న్యూస్‌టుడే: పశ్చిమ మిడ్నాపూర్‌ జిల్లా, దాస్‌ పూర్‌ పరిధి చండీ పూర్‌ వద్ద గురువారం సాయంత్రం 10 చక్రాల లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు కేస్‌ పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బంసగేడియా గ్రామానికి చెందిన సందీప్‌ కులియా (30), ప్రదీప్‌ కులియా(34)గా పోలీసులు గుర్తించారు.
గుంతలో పడి బాలుడు.. జయపురం, న్యూస్‌టుడే: బొయిపరిగూడ సమితి తెంతులిగుమ్మ గ్రామంలో శుక్రవారం ఉదయం గుంతలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సంజయ్‌(2) తన తాత అర్జున్‌ బుమియాతో కలిసి శుక్రవారం ఉదయం అడవికి వెళ్తుండగా అదుపు తప్పి సంజయ్‌ గుంతలో పడిపోయాడు. వర్షపు నీరు ఉండడంతో ఆచూకీ తెలియలేదు. కుటుంబ సభ్యులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమచారం అందించడంతో చేరుకుని, గాలిస్తుండగా బాలుడి మృతదేహం గుంతకు సమీపంలోని కాలువలో తేలింది. మృతదేహాన్ని శవపరీక్ష కోసం నిమిత్తం బొయిపరిగూడ ఆసుపత్రికి తరలించారు.
బస్సు బోల్తా పడి అనంత లోకాలకు.. గోపాలపూర్‌, న్యూస్‌టుడే: పూరీ జిల్లా పిపిలి టోల్‌గేట్‌ ఆవరణలో శుక్రవారం బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో బస్సు హెల్పరు మృతి చెందాడు. 20 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి.
గంజాయి స్వాధీనం.. జయపురం, న్యూస్‌టుడే: కొరాపుట్‌ జిల్లా దశమంత్‌పూర్‌ నుంచి ఉత్తర ప్రదేశ్‌కు గంజాయి రవాణా చేస్తుండగా జయపురం నగరం బర్నిఫుట్‌ ప్రాంతంలో శుక్రవారం టౌన్‌ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. 42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన యువకులుగా గుర్తించారు.
ఖైదీ ఆత్మహత్య .. గోపాలపూర్‌, న్యూస్‌టుడే: పూరీ కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ బిశ్వనాథ్‌ బారిక్‌ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు జైలు అధికార వర్గాలు తెలిపాయి. గావంచాతో మెడకు బిగించుకోవడంతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. అతడు పూరీ జిల్లా బ్రహ్మగిరి వాసి. అత్యాచారం కేసులో కాగారంలో ఉన్నాడు.
ప్రాణాలు విడిచిన చోదకుడు.. రాయగడ గ్రామీణం, న్యూస్‌టుడే: కాశీపూర్‌ సమితి కలియపొడలో గురువారం రాత్రి నీళ్ల ట్యాంక్‌ బోల్తా పడింది. ఈ ఘటనలో ముసిరిపొద గ్రామానికి చెందిన చోదకుడు కృష్ణ మాయి (28) మృతి చెందగా, గిరిధర్‌ మాయి అనే యువకుడు గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానికులు కాశీపూర్‌ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు
విద్యుదాఘాతంతో ఒకరు మృత్యువాత .. రాయగడ గ్రామీణం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లా కాశీపూర్‌ సమితి టికిరి బస్టాండ్‌లో విద్యుత్‌ తీగలు తాకి నిరు(25) అనే బస్సు సహాయకుడు మృతి చెందాడు. రాయగడ సమితి హలువ పంచాయతీ కొడింగ గ్రామానికి చెందిన నిరు గురువారం రాత్రి రాయగడ నుంచి కాశీపూర్‌కు ప్రయాణికులతో బయల్దేరిన ప్రైవేటు బస్సులో టికిరి చేరుకున్నారు. బస్సుపైన సామాన్లు కిందకు దించేందుకు ఎక్కినప్పుడు తీగలు తాకడంతో సృహ కోల్పోయాడు. టికిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.
మోసం కేసులో ముగ్గురి అరెస్టు..
బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపుర బి.ఎన్‌.పూర్‌ ఠాణా పరిధిలోని ఓ ఆసుపత్రి విక్రయం కేసులో మోసం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఓ మహిళ, మరో ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేసి న్యాయస్థానానికి తరలించామని బ్రహ్మపుర ఎస్పీ శరవణ వివేక్‌ ఎం. గురువారం అర్ధరాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
 బ్రహ్మపుర టౌన్‌ ఠాణా పరిధిలోని కళాసీ వీధికి చెందిన ఓ మహిళ (35) సైబర్‌ మోసగాళ్ల వలకు చిక్కుకుని రూ.1.91 లక్షలు పోగొట్టుకున్నారు. ఈ నెల 4న ఆమె మొబైల్‌ ఫోనుకు ఒకరు ఫోను చేసి విద్యుత్తు బకాయిలు తక్షణం చెల్లించకుంటే సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా సొమ్ము చెల్లించాలని చెప్పడంతో ఆమె ఏటీఎం కార్డు సీవీవీ, ఓటీపీ నెంబర్లు తెలిపింది. తర్వాత ఆమె బ్యాంకు ఖాతా నుంచి మోసగాళ్లు వివిధ విడతల్లో రూ.1.91 లక్షల మాయం చేశారు.*  బ్రహ్మపుర శివారు రత్నపూర్‌ వద్ద 59వ నెంబరు జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఓ కారు, మరో ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.* బ్రహ్మపుర బి.ఎన్‌.పూర్‌ ఠాణా పరిధిలో లంజిపల్లి శ్రీకృష్ణనగర్‌ అయిదో లైను వెనుకవైపు చెరువు ఒడ్డున ఉన్న త్రినాథ మందిరంలోకి గురువారం అర్ధరాత్రి దుండగులు ప్రవేశించారు. మందిరంలోని హుండీ వెనుకవైపు రంధ్రం చేసి అందులోని సొమ్ము తదితరాలు దొంగిలించారు.
వివాహిత బలవన్మరణం.. జయపురం: బొరిగుమ్మకు చెందిన వివాహిత శివాని శాంటా(22) ఆత్మహత్యకు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి బయల్దేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని