logo

పాఠశాలలో మద్యం తాగిన విద్యార్థులు.. టీచర్‌ను ఇరికించే ప్రయత్నం విఫలం

ములుగు మండలం మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థుల అసాంఘిక వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది.

Updated : 13 Jul 2023 11:20 IST

ములుగు, న్యూస్‌టుడే: ములుగు మండలం మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థుల అసాంఘిక వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. పాఠశాలలో మద్యం తాగుతూ దొరికిపోగా ఉపాధ్యాయుడిపై నింద మోపేందుకు ప్రయత్నించి ఇరుకున పడ్డారు. విద్యార్థులు మద్యం తాగింది వాస్తవమేనని విచారణలో తేలడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఏమీ మాట్లాడలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే.. మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి, ఇంటర్మీడియట్‌ చదువుతున్న 9 మంది విద్యార్థులు శనివారం రాత్రి మద్యం కొనుగోలు చేసి పాఠశాలకు తీసుకొచ్చి తాగారు. గమనించిన వ్యాయామ ఉపాధ్యాయుడు వారిని మందలించారు. మరో సారి ఇలాంటి పని చేయమని వారితో ఒప్పంద పత్రం రాయించుకున్నారు. మరుసటి రోజు ఉదయం చెప్పా పెట్టకుండా విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. వ్యాయామ ఉపాధ్యాయుడే మద్యం తాగి తాము తాగినట్లు ఒప్పంద పత్రం రాయించుకున్నాడని తల్లిదండ్రులకు చెప్పారు. పిల్లల మాటలు నమ్మిన తల్లిదండ్రులు మరుసటి రోజు పాఠశాలకు వచ్చి వ్యాయామ ఉపాధ్యాయుడితో పాటు మరి కొంత మంది ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మంగళవారం సాంఘిక సంక్షేమ శాఖ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ విద్యారాణి, తహసీల్దారు సత్యనారాయణ స్వామి పాఠశాలకు వెళ్లి విచారణ జరపగా వాస్తవాలు వెలుగు చూశాయి. తొమ్మిదో తరగతి విద్యార్థులు ఏడుగురు, ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఇద్దరు మద్యం తాగారని తేలింది. వీరిలో ఎక్కువ మంది ఏటూరునాగారం మండలానికి చెందిన వారుగా సమాచారం. ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి పాఠశాలకు రాలేదు.


ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం

- అంకయ్య, ప్రిన్సిపల్‌, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, మల్లంపల్లి

విద్యార్థులు మద్యం తాగిన అంశంపై వరంగల్‌ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ వచ్చి మంగళవారం విచారణ జరిపింది వాస్తవమే. ఇప్పటి వరకు విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టీసీలు జారీ చేయలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.


మద్యం దుకాణ యజమానిపై కేసు నమోదు

- సుధీర్‌ కుమార్‌, ఎక్సైజ్‌ సీఐ, ములుగు

విద్యార్థులకు మద్యం విక్రయించినందుకు మల్లంపల్లి శ్రీరామ వైన్స్‌పై కేసు నమోదు చేశాం. శనివారం రాత్రి విద్యార్థులు మద్యం కొనుగోలు చేసినట్లు సీసీ ఫుటేజీల ఆధారంగా తేలింది. 21 సంవత్సరాల లోపు వారికి మద్యం విక్రయించినందుకు దుకాణ యజమానిపై కేసు నమోదు చేసి కమిషనర్‌కు నివేదిక పింపించాం. కమిషనర్‌ ఆదేశాల మేరకు జరిమానా విధిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని