logo

బడుల ప్రారంభం రోజే.. పుస్తకాల పంపిణీ

విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠ్య పుస్తకాలు అందజేసేందుకు విద్యాశాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కొన్నేళ్లుగా సకాలంలో పుస్తకాలు అందకపోవడంతో ఉత్తీర్ణత శాతంపై ప్రభావం పడేది.

Published : 07 May 2024 06:47 IST

జిల్లా గోదాంలో నిల్వచేసిన పాఠ్యపుస్తకాలు

న్యూస్‌టుడే, భూపాలపల్లి : విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠ్య పుస్తకాలు అందజేసేందుకు విద్యాశాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కొన్నేళ్లుగా సకాలంలో పుస్తకాలు అందకపోవడంతో ఉత్తీర్ణత శాతంపై ప్రభావం పడేది.. ఈ సమస్యను అధిగమించేందుకు విద్యాశాఖ అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలోని జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన గోదాంలో నిల్వ చేసిన పుస్తకాలను మొత్తం 11 మండలాలకు సరఫరా చేసేందుకు విద్యాశాఖ అధికారులు టెండర్లు నిర్వహించి, వాహనాల్లో సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 13,240 పుస్తకాలు జిల్లా గోదాంకు ఆదివారం చేరినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 27,340 మంది విద్యార్థులు చదువుతున్నారు.

10 శాతం పుస్తకాలు : జిల్లాలో విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు పరిగణలోకి తీసుకుంటే ఇప్పటివరకు కేవలం 10 శాతం మాత్రమే వచ్చాయి. ఇంకా 90 శాతం రావాల్సి ఉంది. వాస్తవానికి 2,17,475 పుస్తకాలు అవసరం కాగా, ఇప్పటివరకు 13,240 పుస్తకాలు మాత్రమే జిల్లా గోదాంకు చేరాయి. గతేడాదికి సంబంధించిన పుస్తకాలు 2,265 ఉన్నాయి. మిగతా 2,01,970 పుస్తకాలు ఈ నెల 15వ తేదీలోగా జిల్లాకు చేరనున్నాయి. గత విద్యా సంవత్సరం నవంబరు నెలాఖరు వరకు సరఫరా  కొనసాగింది. పుస్తకాల విషయంలో ఈ విద్యా సంవత్సరం అధికారులు చాలా వరకు విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా కృషి చేస్తున్నారు.

ద్విభాష మాధ్యమంలో.. : రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించే పుస్తకాల్లో ఓ వైపు తెలుగు, మరో వైపు ఆంగ్లంలో ముద్రణ ఉంటుంది. తెలుగు మాధ్యమం నుంచి, ఆంగ్లంలో సులువుగా అర్థమవుతుందన్న ఉద్దేశంతో ఇలా ముద్రించారు. ఈ విధానంలో గత రెండేళ్ల నుంచి 3 నుంచి 9వ తరగతి వరకు ముద్రించారు. ఈ సారి 10వ తరగతి వరకు అమలవుతోంది. దీనికి ‘క్యూ ఆర్‌కోడ్‌’ ఉంటుంది. ఈ సారి పుస్తకాల వరస సంఖ్యను ముద్రించారు. అవి పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టారు. బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తే.. సులువుగా గుర్తించేలా ప్రభుత్వ స్టిక్కర్‌ ఉంటుంది.


అన్ని మండలాలకు పంపిస్తాం
- రాంకుమార్‌, జిల్లా విద్యాశాఖ అధికారి

ప్రభుత్వ బడులు ప్రారంభం రోజునే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని జంగేడు గోదాంలో నిల్వచేస్తున్నాం. మొత్తం పుస్తకాలను వచ్చిన తర్వాతనే అన్ని మండలాలకు పంపిస్తాం. ఎంఈవోలు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని