logo

కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టు సాధిస్తా

కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టు పూర్తి చేయడమే నా లక్ష్యం. ప్రాజెక్టు అవసరం లేదంటూ సీఎం జగన్‌ పక్కన పెట్టేశారు. అన్నమయ్య జిల్లా కలికిరిలో బుధవారం జరిగిన ప్రజాగళం బహిరంగసభలో  పాల్గొన్న ప్రధాని మోదీ సైతం ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు.

Published : 10 May 2024 03:36 IST

ఉక్కు పరిశ్రమతో యువతకు ఉపాధి
ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దు చేస్తాం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితం
జిల్లాలో అరాచకాలను అణిచి వేస్తాం
‘ఈనాడు’తో తెదేపా కడప ఎంపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి

కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టు పూర్తి చేయడమే నా లక్ష్యం. ప్రాజెక్టు అవసరం లేదంటూ సీఎం జగన్‌ పక్కన పెట్టేశారు. అన్నమయ్య జిల్లా కలికిరిలో బుధవారం జరిగిన ప్రజాగళం బహిరంగసభలో  పాల్గొన్న ప్రధాని మోదీ సైతం ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. తొలి ప్రాధాన్యంగా ప్రాజెక్టు పూర్తి చేసి జిల్లా వాసులకు సౌకర్యం కల్పిస్తాం. విభజన చట్టంలోనే కడప ఉక్కు పరిశ్రమ ఉంది. దీన్ని సాధించి యువతకు ఉపాధి కల్పిస్తాం. దీన్ని వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి మోసం చేసింది. జిల్లాలో అరాచకాలను ఉక్కుపాదంతో అణిచివేసి ప్రశాంత వాతావరణం తీసుకొస్తాం. ప్రధానంగా సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారా ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందుబాటులోకి తీసుకొస్తాం. గత 30 ఏళ్లుగా ఒకే కుటుంబానికి పదవులు కట్టబెట్టి జిల్లా ప్రజానీకం మోసపోయింది. ఇప్పుడు ఆ కుటుంబం ఆస్తులు, కేసులు కొట్లాటలతో బజారుకెక్కింది. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. తెదేపా శక్తి చూపిస్తా. జిల్లా రూపురేఖలు మారుస్తా.

 ‘ఈనాడు’ ముఖాముఖిలో తెదేపా ఎంపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి

వైకాపా ప్రభుత్వ హయాంలో జిల్లాకు పరిశ్రమలు రాకపోవడంతో నిరుద్యోగం పెరిగిపోయింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి కూడా చాలావరకు మూతపడ్డాయి. డిగ్రీలతో బయటకొస్తున్న యువతకు తగిన ఉద్యోగావకాశాల్లేవు. కూటమి అధికారం చేపట్టగానే చంద్రబాబునాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీపైనే ఉంటుంది. ఏటా జాబ్‌ క్యాలెండరు, బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేస్తాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత లక్ష్యం. నిరుద్యోగ యువతకు విశాఖపట్నంలో లక్ష ఉద్యోగాలు కల్పించేవిధంగా ప్రణాళిక ఉంది. ప్రభుత్వం మారిన వెంటనే పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తాం.


ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా

వైకాపా పాలనలో ప్రజలపై పన్నుల భారం విపరీతంగా పెరిగింది. ఆస్తిపన్నుతో పాటు చెత్తపన్నుతో బాదేశారు. విద్యుత్తు బిల్లులు రెట్టింపయ్యాయి. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ధరల నియంత్రణపై దృష్టిసారిస్తాం. చెత్తపన్ను రద్దుతో పాటు ఆస్తి పన్ను విధానాన్ని సమీక్షిస్తాం. వాస్తవంగా రాష్ట్రానికి పెట్టుబడులు రాక కొత్త పరిశ్రమలు లేక ఉపాధి దొరక్క ప్రజలకు కొనుగోలు శక్తి పడిపోయింది. బ్యాడ్జి ఉన్న డ్రైవర్లకు రూ.15 వేలు ఇస్తాం. జరిమానా, హరిత పన్ను భారం తగ్గిస్తాం. ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేదలపై చాలా భారాన్ని తగ్గిస్తాయి. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తాం.


రైతులకు ఏటా రూ.20 వేలు

అన్నదాతలను ఆదుకునేందుకు ఏటా రూ.20 వేలు అందిస్తాం. ఇది వారికెంతో భరోసాగా ఉంటుంది. కర్షకులకు మేలు చేసే నిర్ణయాలు అమలు చేస్తాం. రైతులకు అన్ని రకాలుగా ఉండగా ఉంటాం. ఉద్యాన రైతులకు పథకాలను పునరుద్ధరిస్తాం. బిందు సేద్యం పథకానికి 90 శాతం రాయితీ తీసుకొస్తాం. ఎన్డీఏలో ఉన్నందున కోల్డ్‌ స్టోరేజీలు తీసుకొచ్చి రైతులు పంటలను నిల్వ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాం. అరటి రైతులకు పథకాలు తీసుకొచ్చి గిట్టుబాటు ధర కల్పిస్తాం. పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లలో స్థలాలు ఇవ్వడంతో పాటు ఇప్పటికే పట్టాలు పొందినవారికి పక్కా ఇళ్లు నిర్మిస్తాం.


అరాచకాలు అణచివేస్తాం

జిల్లాలో అరాచకాలు పెరిగిపోయాయి. భూదందాలు, ఇసుక, మద్యం మాఫియాలు ప్రజలను పీడిస్తున్నాయి. వీరిని అణచివేయడమే ధ్యేయంగా చర్యలు తీసుకుంటాం. ప్రజల ఆస్తులకు ప్రమాదకరమైన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తుంది. చంద్రబాబు రెండో సంతకం దానిపైనే చేస్తారు. ప్రజలు వైకాపాకు ఓటేస్తే వారి ఆస్తులను దొంగల చేతిలో పెట్టినట్లే, మన తాత తండ్రుల నుంచి వచ్చిన ఆస్తుల మీద జగన్‌ బొమ్మ అనేది అసంబద్దం. 


ఒకటో తేదీనే జీతాలు... పింఛన్లు

తెదేపా ప్రభుత్వ హయంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రతి నెల 1, 2 తేదీల్లోనే జీతాలు, పింఛన్లను వారి ఖాతాల్లో జమ చేసేవారు. ప్రస్తుత వైకాపా ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు, పింఛనదారులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తెదేపా అధికారంలోకి రాగానే ఉద్యోగులకు, పింఛనుదారులకు న్యాయమైన డిమాండ్ల పరిష్కారంతో పాటు ప్రతి నెలా ఒకటో తారీఖునే వారికి జీతాలు, పింఛన్లు అందిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులంతా ఎన్నికల కోసమే ఎదురు చూస్తున్నారు. తెదేపా ప్రభుత్వం రాగానే ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చెల్లిస్తామని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు.


50 ఏళ్లకే రూ.4 వేల పింఛను

తెదేపా ప్రభుత్వ హయాంలో చంద్రన్న బీమా పథకం పేదలకు రక్షణగా ఉండగా, వైకాపా ప్రభుత్వం అమలు చేయకుండా మోసం చేసింది. తెదేపా అధికారంలోకి రాగానే ఎసీˆ్స, ఎసీˆ్ట, బీసీˆ, మైనార్టీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను ఇచ్చి ఆదుకుంటాం. దివ్యాంగుల పింఛను రూ.6 వేలకు, తలసేమియా, కిడ్నీ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు రూ.10 వేలకు పెంచి అందజేస్తాం. అర్చలకు కనీస వేతనం రూ.15 వేలు, దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేలు ఇస్తాం. చంద్రన్న బీమా పథకం కింద సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు బీమాసాయం ఆయా కుటుంబాలకు ఆసరాగా ఉంటుంది. 


బీసీ వర్గాలకు రూ.5 వేల కోట్లతో ఆదరణ

బీసీల రక్షణలకు తెదేపా ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తుంది.  బీసీˆ వర్గాలకు రూ.5 వేల కోట్లతో ఆదరణ కల్పిస్తాం. మత్య్సకారులకు వేట విరామ సమయంలో రూప.20 వేల ఆర్థిక సాయం, సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో పది శాతం కేటాయింపు, క్వారీల్లో వడ్డెరలకు 15 శాతం రిజర్వేషన్‌, రాయల్టీ, సీˆనరేజ్‌ ఛార్జీల్లో మినహాయింపు, రజకుల దోబీ ఘాట్ల నిర్మాణాలకు ప్రోత్సాహం, విద్యుత్తు ఛార్జీల్లో రాయితీ ఇస్తాం.  యువత నిరాశలో కూరుకుపోకుండా నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున అందిస్తాం.


మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు

గతంలోనూ ఎన్డీఏలో ఉండగా మైనార్టీలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. చంద్రబాబుకు మైనార్టీలంటే ప్రత్యేకమైన ప్రేమ ఉంది. ముస్లిం మైనార్టీలకు పట్టణాల్లోని ఈద్గా, ఖబరస్తాన్‌లకు స్థలాల కేటయింపు, మైనార్టీ కార్పోరేషన్‌ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, ఇమామ్‌లకు ప్రతినెల రూ.10 వేలు, మౌజన్‌లకు రూ.5 వేలు గౌరవ వేతనం, మసీదుల నిర్వహణకు ఆర్థిక సాయం చేస్తాం. క్రిస్టియన్‌ మిషనరీల ఆస్తుల అభివృద్ధికి బోర్డు ఏర్పాటు చేస్తాం. జెరూసలెం, హజ్‌ యాత్రికులకు సాయం అందిస్తాం. కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్‌హౌస్‌ను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం. ముఖ్యంగా దీని విషయంలో వైకాపా మోసాన్ని అందరూ గ్రహించారు.


ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు

కూటమి మ్యానిఫెస్టో మహిళల అభివృద్ధికి దోహదపడుతుంది. 19 నుంచి 59 ఏళ్ల వయసున్న ప్రతి మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తాం. అయిదేళ్లకు రూ.90 వేలు సాయం అందుతుంది. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేల చొప్పున అయిదేళ్లకు రూ.75 వేలు అందిస్తాం. ఆయా కుటుంబాల్లో ఎంతమంది విద్యార్థులుంటే అంతమంది అర్హులే. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో రాష్ట్ర ఆర్థిక ప్రగతి మెరుగవుతుంది. ఖర్చు లేకపోవడంతో మహిళలు ఉద్యోగాలు, వివిధ రకాల పనులు చేయడానికి ఆసక్తి చూపుతారు. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో మహిళలు స్వయం సమృద్ధి సాధిస్తారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ చెల్లింపు, ఆశా కార్యకర్తలకు కనీస వేతనాన్ని పెంచుతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని