icon icon icon
icon icon icon

Smriti Irani: బావ కన్నేశాడు.. రాహుల్‌జీ కర్చీఫ్‌ వేయండి: స్మృతి ఇరానీ కౌంటర్‌

Smriti Irani - Rahul Gandhi: అమేఠీ స్థానంపై రాహుల్‌ గాంధీ బావ రాబర్ట్‌ వాద్రా కన్నేశారన్నారు  సిట్టింగ్‌ ఎంపీ స్మృతి ఇరానీ. ఇక కాంగ్రెస్‌ నేత తన సీటుపై కర్చీఫ్‌ వేసుకోవాలేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

Updated : 23 Apr 2024 12:02 IST

దిల్లీ: ఒకప్పటి పార్టీ కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ (Congress) ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఇక్కడి నుంచి ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా (Robert Vadra) పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై భాజపా (BJP) ఎంపీ స్మృతి ఇరానీ (Smriti Irani) తాజాగా స్పందిస్తూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై విమర్శలు చేశారు.

అమేఠీ (Amethi) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్మృతి.. హస్తం పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు. ‘‘ఇలా ఎప్పుడైనా జరిగిందా? పోలింగ్‌కు ఇంకా 27 రోజులే ఉంది. కానీ, ఇంకా కాంగ్రెస్‌ తమ అభ్యర్థిని ప్రకటించకపోవడం వారి అహంకారానికి నిదర్శనం. ఈ స్థానంపై రాహుల్‌ గాంధీ బావ (రాబర్ట్‌ వాద్రాను ఉద్దేశిస్తూ) కన్నేశారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తారో? ఒకప్పుడు ప్రజలు బస్సుల్లో వెళ్లే సమయంలో సీట్ల కోసం కర్చీఫ్‌ వేసుకునేవారు. ఇప్పుడు రాహుల్‌ కూడా తన సీటును బుక్‌ చేసుకునేందుకు అలానే చేయాలేమో మరి’’ అంటూ కేంద్రమంత్రి ఎద్దేవా చేశారు.

రాహుల్‌పై ఈసీకి భాజపా ఫిర్యాదు..

ఐదో విడత పోలింగ్‌లో భాగంగా అమేఠీ స్థానానికి మే 20వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న స్మృతి ఇరానీ వరుసగా రెండో సారి భాజపా తరఫున పోటీ చేస్తున్నారు. 2019 కంటే ముందు వరుసగా మూడు సార్లు రాహుల్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. గతంలో గాంధీ కుటుంబ సభ్యులు సోనియా, రాజీవ్‌, సంజయ్‌ కూడా ఇక్కడి నుంచి గెలుపొందారు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు మంచి పట్టున్న ఈ ప్రాంతంలో ఇప్పుడు హస్తం ఆదరణ కోల్పోతూ వస్తోంది. గత ఎన్నికల్లో అమేఠీలో రాహుల్‌ ఓటమి ఆ పార్టీని గట్టిగా దెబ్బతీసింది. ఈ నేపథ్యంలోనే తాజా ఎన్నికల్లో వారి కుటుంబసభ్యులు ఇక్కడి నుంచి పోటీ చేస్తారా? లేదా? అన్నది సందిగ్ధంగా మారింది.

ఇదే సమయంలో ఇటీవల రాబర్ట్‌ వాద్రా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అమేఠీ ప్రజలు తన ప్రాతినిధ్యాన్ని కోరుకుంటున్నారని, ఇక్కడ తన అభ్యర్థిత్వంపై సరైన సమయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. మరోవైపు రాహుల్‌ ఇక్కడి నుంచి పోటీపై స్పందిస్తూ.. పార్టీ చెప్పినట్లే నడుచుకుంటానని అన్నారు. ఆయన ప్రస్తుతం బరిలో ఉన్న కేరళలోని వయనాడ్‌ స్థానానికి ఏప్రిల్‌ 26న పోలింగ్‌ జరగనుంది. ఇక అమేఠీలో నామినేషన్‌ సమర్పణకు మే 3 చివరి తేదీ. దీంతో వయనాడ్‌ పోలింగ్‌ తర్వాత అమేఠీలో రాహుల్‌ పోటీపై ప్రకటన వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img