Top Ten News @ 1PM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తల కోసం క్లిక్‌ చేయండి 

Updated : 09 Dec 2021 13:50 IST

1. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల తక్షణ సాయం: సీఎం జగన్‌

యుద్ధప్రాతిపదికన గులాబ్‌ తుపాను సహాయక చర్యలు చేపట్టాలని ఏపీ సీఎం జగన్‌ ఆదేశించారు.  తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. వర్షం తగ్గుముఖం పట్టగానే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలని జగన్‌ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున తక్షణ సాయాన్ని వెంటనే ఇవ్వాలని.. బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారు.

2. TS Assembly: అది రుణం కాదు.. భవిష్యత్తుకు పెట్టుబడి: కేటీఆర్‌

తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా సాధారణ కార్యకలాపాలు మొదలయ్యాయి. పరిశ్రమలు, ఐటీ రంగాలపై స్వల్పకాలిక చర్చలో భాగంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. హైదరాబాద్‌లో రోడ్లు, పైవంతెనల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన కోసం ఉత్పాదక రంగంలో వెచ్చించే ప్రతి రూపాయి భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగానే భావించాలని.. దాన్ని రుణంగా చూడొద్దన్నారు.

TS Assembly: అసెంబ్లీకి గుర్రపు బండ్లపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు.. 

3. HYD: హైదరాబాద్‌లో రానున్న 4-5 గంటల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు!

గులాబ్‌ తుపాను ప్రభావంతో రానున్న 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. హైదరాబాద్‌ నగరంలో రానున్న 4-5 గంటల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. ఈ తుపాను ప్రభావంతో ఇప్పటికే తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. 

JNTU: జేన్‌ఎన్‌టీయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా

4. వైకాపా ఇచ్చిన హామీలు అవి.. అమలు చేస్తోంది ఇవీ..: పవన్‌ ట్వీట్‌

ఏపీలో ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం పన్నుల రుద్దుతోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. మద్యం ఆదాయం తాకట్టుతో అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదని.. సంక్షేమం అసలే కాదన్నారు. ఈ మేరకు పవన్‌ ట్వీట్‌ చేశారు. ‘నేటి నవరత్నాలు.. భావితరాలకు నవ కష్టాలు’ అని ఆయన ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వం చేసిన వాగ్దానాలు.. వాటిని అమలు చేయడంలో కనిపిస్తున్న కటిక నిజాలు పేరిట #SaveAPfromYSRCP హ్యాష్‌ ట్యాగ్‌తో ట్వీట్‌ పోస్ట్‌ చేశారు.

5. India Corona: ఊరటనిస్తోన్న గణాంకాలు.. 3 లక్షల దిగువకు క్రియాశీల కేసులు 

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తోంది. 30 వేల దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులు తగ్గుతుండటంతో.. క్రియాశీల కేసుల సంఖ్య కూడా 3 లక్షల దిగువకు పడిపోయింది. మృతుల సంఖ్య 300 లోపే నమోదైంది. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెలువరించిన ఈ గణాంకాలు కాస్త ఊరట కలిగిస్తున్నాయి.

6. Bharat Bandh: ప్రశాంతంగా కొనసాగుతున్న భారత్‌ బంద్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ ఉదయం ప్రారంభమైన భారత్‌ బంద్‌ ప్రశాంతంగా సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు బంద్‌లో పాల్గొ్న్నాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతికేరంగా నినాదాల చేస్తూ ర్యాలీలు నిర్వహించాయి.

Bharat Bandh: బంద్‌లో రైతన్నలు.. దిల్లీ సరిహద్దుల వద్ద భద్రత పెంపు

7. MAA Elections: చిరంజీవి.. విష్ణుకు కూడా మద్దతు ఇవ్వొచ్చు: జీవిత

‘మా’ అధ్యక్ష పదవికి ప్రకాశ్‌రాజ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. తన ప్యానెల్‌ సభ్యులతో కలిసి ఈ ఉదయం నామినేషన్‌ వేశారు. నామినేషన్‌ వేసిన అనంతరం ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడుతూ.. ‘‘ఇవి ఎన్నికలు కాదు.. పోటీ మాత్రమే. గెలిపించేది.. ఓడించేది ఓటర్లే. అక్టోబర్‌ 3న మా ఎన్నికల ప్రణాళిక వెల్లడిస్తా’’ అని చెప్పారు. జనరల్‌ సెక్రటరీగా నామినేషన్‌ వేసిన జీవితా రాజశేఖర్‌ మాట్లాడుతూ. ‘చిరంజీవిగారు మద్దతు ప్రకాశ్ రాజ్‌కు ఉందనడానికి మా దగ్గర ఆధారాలు లేవు. చిరంజీవి విష్ణుకు కూడా మద్దతు ఇవ్వొచ్చు’’ అని అన్నారు.

8. 6 నెలలు అనుకుంటే.. 7 ఏళ్లు దాటేసింది..!

భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన మంగళయాన్‌ వ్యోమనౌక.. అంగారకుడి కక్ష్యలో ఏడేళ్లు పూర్తి చేసుకుంది. వాస్తవానికి ఆరు నెలలు పనిచేసేలా దీన్ని రూపొందించగా.. అది ఇప్పటికీ అద్భుతంగా సేవలు అందిస్తోంది. తాజా మైలురాయిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ ఛైర్మన్‌ కె.రాధాకృష్ణన్‌ హర్షం వ్యక్తంచేశారు. 

9. German elections: ఎన్నికల్లో ఏంజెలా మెర్కల్‌ పార్టీకి ఎదురుదెబ్బ..!

జర్మనీలో జరుగుతున్న జాతీయ ఎన్నికల్లో ఏంజెలా మెర్కల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సీడీయూ (క్రిస్టియన్‌ డెమొక్రటిక్‌ యూనియన్‌)కు గట్టి ఎదురు దెబ్బ తగలనుందని ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు అంచనా వేస్తున్నాయి.  వీరి ప్రత్యర్థి అయిన సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ స్వల్ప ఆధిక్యం దక్కించుకుంటుందని చెబుతున్నాయి. మెర్కెల్‌ త్వరలో పదవి నుంచి వైదొలగనుండటంతో ఆమె స్థానంలో రానున్న అర్మెన్‌ లాస్చెట్‌కు ఇది గట్టి ఎదురు దెబ్బ. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడాల్సి ఉంది.

10. IPL 2021: 30 పరుగుల తేడాతో 8 వికెట్లు.. నమ్మశక్యం కాలేదు..

గతరాత్రి ముంబయితో తలపడిన మ్యాచ్‌లో సంచలన బౌలింగ్‌తో బెంగళూరు ఆకట్టుకుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌ను 111 పరుగులకే కుప్పకూల్చింది. ఈ విజయంపై కెప్టెన్‌ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ తమ బౌలింగ్‌ పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘మేం గెలిచిన తీరుపై చాలా ఆనందంగా ఉంది. ఇక ముంబయి ఇన్నింగ్స్‌లో 30 పరుగుల తేడాతో మా బౌలర్లు 8 వికెట్లు పడగొట్టడం నమ్మశక్యం కానిది’అని అన్నాడు. 

IPL 2021: లోపాలు సరిదిద్దుకున్నాం.. జడేజా అలా ఆడితే ఏం చేయగలం?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని