Harish Rao: గవర్నర్‌, కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు వరుస ట్వీట్లు

వైద్య కళాశాలల కేటాయింపు విషయంపై గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విటర్‌ వేదికగా స్పందించారు. 

Updated : 05 Mar 2023 20:24 IST

హైదరాబాద్‌: వైద్య కళాశాలల (Medical colleges) కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) ఆరోపించారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విన్నవించినా తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా కేటాయించలేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు అప్పటి వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ (Etela Rajender) కేంద్రాన్ని మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని కోరారని.. అందుకు కేంద్రం సైతం సానుకూలంగా స్పందించిందని పేర్కొంటూ ఓ వీడియోను మంత్రి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 

తెలంగాణ ప్రభుత్వం సకాలంలో మెడికల్ కాలేజీల కోసం దరఖాస్తు చేసుకోలేదంటూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ (Governor Tamilisai Soundararajan) ట్వీట్‌ చేశారు. రాష్ట్రానికి ఎన్ని మెడికల్‌ కాలేజీలు ఇచ్చారంటూ ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు ఆమె విభిన్నమైన సమాధానం ఇచ్చారు. పీఎంఎస్‌ఎస్‌వై కింద కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌  మాండవీయ పిలుపుమేరకు అన్ని రాష్ట్రాలు కొత్త మెడికల్‌ కళాశాలలకు దరఖాస్తు చేసుకున్నాయన్నారు. ఆ సమయంలో సకాలంలో దరఖాస్తు చేసుకోవటంలో తెలంగాణ వైఫలమైందన్నారు. తెలంగాణకు ఒకే ఏడాదిలో 11 మెడికల్‌ కాలేజీలు లభించాయన్న గవర్నర్‌.. మీరు నిద్రపోయి ఆలస్యంగా మేల్కొని.. ఆ తర్వాత ఇవ్వమని అడుగుతారంటూ వంగ్యస్త్రాలు జోడించారు. 

దీనిపై స్పందించిన మంత్రి  హరీశ్ రావు వరుస ట్వీట్లు చేశారు. మెడికల్ కాలేజీల కేటాయింపులో గవర్నర్‌, కేంద్ర మంత్రి పొంతన లేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకరు తెలంగాణ మెడికల్ కాలేజీలు కావాలని కోరలేదంటే... మరొకరు ప్రైవేటు మెడికల్ కాలేజీలున్న ఖమ్మం, కరీంనగర్‌లో కొత్త కాలేజీల కోసం దరఖాస్తు చేసుకోవటం వల్లే కొత్తవి మంజూరు చేయలేదంటున్నారని మండిపడ్డారు. ఈ మేరకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని సైతం మంత్రి ట్వీట్‌కు జతచేశారు. ప్రతి లక్ష మందికి 19 మెడికల్ సీట్లతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్న హరీశ్ రావు.. జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్... రాష్ట్ర నిధులతో 12 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారన్నారు. కేంద్రం, గవర్నర్ అనవసరంగా విమర్శలు చేసే బదులుగా ఒకే రోజు 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన తెలంగాణను అభినందించాలన్నారు. 

బీబీనగర్ ఎయిమ్స్‌కి నిధుల కొరత ఉందన్న హరీశ్‌రావు.. దేశవ్యాప్తంగా ఎయిమ్స్ వృద్ధి కోసం రూ.1,365 కోట్లు మంజూరు చేస్తే అందులో తెలంగాణకు మాత్రం కేవలం రూ.156 కోట్లే కేటాయించటానికి గల కారణం ఏంటని ప్రశ్నించారు. గుజరాత్ ఎయిమ్స్‌కి 52 శాతం , తెలంగాణ 11.4 శాతం నిధులు ఇచ్చిన కేంద్రం.. తెలంగాణపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ గవర్నర్ తన పంథాను మార్చుకొని... ట్రైబల్ యూనివర్సిటీ, రైల్ కోచ్‌లు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తే రాష్ట్ర ప్రజలకు మేలు చేసిన వారవుతారని హరీశ్‌రావు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని