Mosquito: వామ్మో.. ఇది మామూలు దోమకాదు.. కుడితే 30 సర్జరీలా!

దోమ కుట్టడం వల్ల జర్మనీకి చెందిన ఓ వ్యక్తి  చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. ఇంతకీ అతణ్ని ఏ దోమ కుట్టింది? కేవలం దోమ కాటుకే ఆ వ్యక్తి ప్రాణాలు పోయే పరిస్థితి తలెత్తిందా? అసలు ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం. 

Published : 29 Nov 2022 01:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దోమ కుడితే సాధారణ జ్వరం లేదా మలేరియా, డెంగీ వంటి విష జ్వరాలు వస్తుంటాయి. కొన్నిసార్లు అవి ప్రాణాంతకం కూడా కావచ్చు. ఇవేవీ కాకపోతే కాసేపు దురద పెడుతుంది, తర్వాత దద్దుర్లు వస్తాయి. కానీ, జర్మనీలోని రోడెర్మార్‌ నగరానికి చెందిన 27 ఏళ్ల సెబాస్టియన్‌ రోట్ష్కే అనే వ్యక్తికి దోమ కుట్టడంతో చావు అంచుల దాకా వెళ్లాడు. ఇప్పటివరకు 30 సర్జరీలు చేయించుకోవడమే కాకుండా, నాలుగు సార్లు కోమాలోకి వెళ్లినట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తెలిపింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..?

గతేడాది వేసవిలో సెబాస్టియన్‌ను ఓ దోమ కుట్టింది. తర్వాత కొద్దిరోజులకు అతనికి ఫ్లూ లక్షణాలు కనిపించడంతో డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకున్నాడు. కానీ, క్రమంగా అతడి రెండు కాలి వేళ్లు తెగిపోయినట్లుగా మారిపోతుండటంతో వాటిని సరిచేసేందుకు 30సార్లు ఆపరేషన్‌ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతడు నాలుగుసార్లు కోమాలోకి కూడా వెళ్లారట. అంతేకాకుండా కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులు కొంతకాలం సరిగా పనిచేయలేదని, రక్తం విషపూరితమైందని ఆయన తెలిపినట్టు సదరు వార్తా సంస్థ పేర్కొంది. తర్వాత ఎడమ తొడపై ఏర్పడిన గడ్డను తొలగించేందుకు మరోసారి సర్జరీ చేయించుకున్నారట.

ఈ క్రమంలో చాలాసార్లు మృత్యు అంచుల వరకు వెళ్లివచ్చానని, డాక్టర్లు ఎప్పటికప్పుడు వ్యాధి లక్షణాలను గుర్తించి చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటడినట్టు సెబాస్టియన్‌ తెలిపారు. అయితే, సెబాస్టియన్‌ను ఏషియన్‌ టైగర్‌ దోమ కుట్టినట్లు డాకర్లు నిర్థారించారు. ఈ దోమలు ఎక్కువ పగలు కుడతాయట. వీటివల్ల డెంగీ వంటి విష జ్వరాలతోపాటు జికా వైరస్‌, వెస్ట్‌ నైల్‌ వైరస్‌, చికెన్ గున్యా వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే దోమ తెరలు వాడటంతోపాటు ఇతర జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని