AP News: 4 కి.మీ. డోలీలో గర్భిణి

కాబోయే తల్లులకు మ‌న్యంలో క‌ష్టాలు, క‌న్నీళ్లు నిత్య‌కృత్యంగా మారాయి. మ‌న్యంలో డోలీ మోత‌ల‌కు స్వ‌స్తి ప‌లికేందుకుగానూ ప్ర‌స‌వానికి వారంరోజులు ముందే గ‌ర్భిణుల‌ను స‌మీప ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించాల‌ని....

Published : 05 Aug 2021 01:49 IST

చింతపల్లి: కాబోయే తల్లులకు మ‌న్యంలో క‌ష్టాలు, క‌న్నీళ్లు నిత్య‌కృత్యంగా మారాయి. మ‌న్యంలో డోలీ మోత‌ల‌కు స్వ‌స్తి ప‌లికేందుకుగానూ ప్ర‌స‌వానికి వారంరోజులు ముందే గ‌ర్భిణుల‌ను స‌మీప ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించాల‌ని అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేస్తున్నా ఇవి క్షేత్ర‌స్థాయిలో స‌క్ర‌మంగా అమ‌లు కావ‌డంలేదు.తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. విశాఖ మ‌న్యంలోని తోకపాడుకు చెందిన గర్భిణిని ఆసుపత్రికి చేర్చేందుకు ఆమెను డోలీలో ఉంచి.. కొండ ప్రాంతం నుంచి ఏకంగా నాలుగు కిలోమీట‌ర్లు ప్రయాణించి ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.

చింత‌ప‌ల్లి మండ‌లం బలపం పంచాయతీ తోకపాడుకు చెందిన కూసంగి చంద్రమ్మ(22)కు నెలలు నిండటంతో మంగళవారం రాత్రి నుంచి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. తోకపాడు గ్రామం నుంచి రోడ్డు పాయింట్‌కి వెళ్లాలంటే దట్టమైన అటవీ ప్రాంతంలో దాదాపు నాలుగు కిలోమీటర్లు ఉన్న కొండ ఎక్కాలి. చంద్రమ్మది మొదటి కాన్పు కావడంతో ఆశా కార్యకర్త గ్రామస్థులను అప్రమత్తం చేశారు. దీంతో బుధవారం ఉదయం చంద్రమ్మను డోలీలో ఎక్కించుకొని రోడ్డు పాయింట్‌కి తరలించారు. సుమారు నాలుగు కిలోమీటర్లు ఉన్న కొండ ఎక్కి అతి కష్టం మీద బ‌ల‌పం రోడ్డు పాయింట్‌కి ఆమెను మోసుకువచ్చారు. అక్కడి నుంచి లోతుగెడ్డ పీహెచ్‌సీకి త‌ర‌లించేందుకు అంబులెన్‌కు ఫోన్ చేస్తే ఆ ప్రాంతానికి వచ్చేందుకు ఆల‌స్యమవుతుంద‌ని చెప్ప‌డంతో ఓ ఆటోలో లోతుగెడ్డ  పీహెచ్‌సీకి తీసుకెళ్లారు.  తమ గ్రామానికి రహదారి సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తోకపాడు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని