AP Skill Development Case: సీమెన్స్‌పై చేస్తున్న ఆరోపణలన్నీ బోగస్‌: మాజీ ఎండీ సుమన్‌ బోస్‌

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు నిరాధారమైందని సీమెన్స్‌ కంపెనీ మాజీ ఎండీ సుమన్‌ బోస్‌ అన్నారు. ఈ ప్రాజెక్టు నూరుశాతం విజయవంతమైందని.. దీనిలో ఏమాత్రం అవినీతి జరగలేదని చెప్పారు.

Updated : 17 Sep 2023 13:13 IST

దిల్లీ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు నిరాధారమైందని సీమెన్స్‌ కంపెనీ మాజీ ఎండీ సుమన్‌ బోస్‌ అన్నారు. ఈ ప్రాజెక్టు నూరుశాతం విజయవంతమైందని.. దీనిలో ఏమాత్రం అవినీతి జరగలేదని చెప్పారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్‌ తదితర పరిణామాల నేపథ్యంలో దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2021లోనే ప్రాజెక్టుకు సంబంధించిన శిక్షణ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించామని తెలిపారు. 

‘2014లో రాష్ట్ర విభజన జరిగినపుడు ఐటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం ముందుకొచ్చింది. 40 ప్రాంతాల్లో 200 ల్యాబ్స్‌ ఏర్పాటు చేశాం. 2021 నాటికి 2.32లక్షల మంది నైపుణ్యం సాధించారు. వారికి సర్టిఫికేషన్‌ ఇవ్వడంతో ఉద్యోగాలు చేస్తున్నారు.  2021 తర్వాత అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. గతంలో మెచ్చుకున్న ఏపీఎస్‌ఎస్‌డీసీ (ఏపీ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌).. ఈ ప్రాజెక్టు బోగస్‌ అని ఆరోపించింది. ఒక్క కేంద్రాన్నీ సందర్శించలేదు.. ఎక్కడా తనిఖీ చేయకుండా అక్రమాలు జరిగాయంటున్నారు. ఇలా ఎందుకు జరిగిందన్నది పెద్ద మిస్టరీ. ప్రాజెక్టులో ఏమాత్రం అవినీతి, మనీలాండరింగ్‌ జరగలేదు.

సీమెన్స్‌ కంపెనీతో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కి మధ్య ఒప్పందం ఉంది. అన్నీ అధ్యయనం చేసిన తర్వాతే ఈ ప్రాజెక్టు ప్రారంభించాం.. అది విజయవంతమైంది. ఒక సాఫ్ట్‌వేర్‌పై యువతకి అవగాహన కల్పించినపుడు ఆ దానికి డిమాండ్ పెరుగుతుంది. మార్కెటింగ్‌లో భాగంగానే 90:10 ఒప్పందం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు ఒప్పందాలు  చేసుకుంటున్నాయి. సీమెన్స్‌పై చేస్తున్న ఆరోపణలన్నీ బోగస్‌. ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా చూపలేదు. ఇదే తరహా ప్రాజెక్టును చాలా రాష్ట్రాల్లో అమలు చేశాం. ఈ వ్యవహారం న్యాయస్థానాల పరిధిలో ఉన్నందున అన్ని విషయాలు అక్కడే చెబుతాం’’అని సుమన్‌ బోస్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని