Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 09 Apr 2023 17:19 IST

1. తెలంగాణతో సమానంగా వృద్ధి చెందిన రాష్ట్రాన్ని చూపించగలరా?: మోదీకి కేటీఆర్‌ సవాల్‌

కేవలం రాజకీయాల కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ వచ్చారని భారాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. భారాసపై ప్రధాని మోదీ విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన ట్విటర్‌ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ జీడీపీ వృద్ధికి తోడ్పడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. భారాస ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి: మంత్రి కేటీఆర్‌

తెలంగాణలో విస్తృతంగా భారత రాష్ట్ర సమితి (BRS) ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు చేపట్టేందుకు ఆ పార్టీ సమాయత్తమవుతోంది. రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో ఈ నెల 27న పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో భారాస ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించనుంది. ఈ మేరకు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ప్రకటన విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అలా అయితే ఐపీఎల్‌లో ఆడొద్దు.. వార్నర్‌పై సెహ్వాగ్‌ తీవ్ర విమర్శలు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఛాంపియన్‌గా నిలిపిన ఆసీస్ టాప్‌ బ్యాటర్ డేవిడ్‌ వార్నర్‌... ప్రస్తుత సీజన్‌లో మాత్రం దిల్లీ క్యాపిటల్స్‌కి ఇప్పటి వరకు అతని సారథ్యంలో ఆడిన జట్టుకు మూడు మ్యాచుల్లో ఒక్క విజయం కూడా సాధించపెట్టలేకపోయాడు. రెగ్యులర్‌ సారథి రిషభ్‌ పంత్ రోడ్డు ప్రమాదానికి గురై ఈ సీజన్‌కు దూరం కావడంతో వార్నర్‌కు జట్టు పగ్గాలను మేనేజ్‌మెంట్ అప్పగించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. దీక్షకు దిగుతానని సచిన్‌ హెచ్చరిక.. రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో కలవరం!

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ల మధ్య ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమైంది. గతంలో వసుంధర రాజే  నేతృత్వంలోని భాజపా ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవడంలో సీఎం గహ్లోత్‌ సర్కారు విఫలమైందని సచిన్‌ పైలట్‌ తాజాగా ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అలా జరగకపోతే నాకు మెసేజ్‌ పెట్టండి: పరుచూరి గోపాలకృష్ణ

కొత్త సినిమాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ.. సినిమా తెరకెక్కించడంలో యువతరానికి సలహాలు, సూచనలు ఇస్తుంటారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. తాజాగా ఆయన ‘బలగం’పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ సినిమా చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలిపారు. సినిమా చూసిన వెంటనే చిత్ర దర్శకుడు వేణుతోపాటు పాటల రచయిత కాసర్ల శ్యామ్‌ను ఫోన్‌ చేసి అభినందించానన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. దేశంలో పులుల సంఖ్య 3,167.. ప్రాజెక్ట్‌ టైగర్‌ స్వర్ణోత్సవంలో మోదీ

భారత్‌ కేవలం పులులను సంరక్షించడమే కాకుండా.. వాటి సంఖ్య వృద్ధి చెందడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రాజెక్ట్‌ టైగర్‌ విజయవంతం కావడం కేవలం భారతదేశానికేకాక.. యావత్‌ ప్రపంచానికి గర్వకారణమని అన్నారు. ప్రాజెక్ట్‌ టైగర్‌ స్వర్ణోత్సవాల సందర్భంగా కర్ణాటకలోని మైసూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రధాని ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నిబంధనలు మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం : రిజిజు

అసత్య, తప్పుడు వార్తలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఫేక్‌ న్యూస్‌ను గుర్తించేందుకు ఇప్పటివరకు ఉన్న నిబంధనలను సవరించేందుకు సంప్రదింపుల ప్రక్రియ నడుస్తోందన్నారు. వీటిని అమలులోకి తీసుకురావడానికి ముందు అనేక చర్చల అవసరముందన్నారు. జమ్మూ కశ్మీర్‌లో జరిగన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తప్పుడు వార్తల కట్టడిపై కేంద్రం పని చేస్తోందని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. తైవాన్‌ జలసంధిలో కొనసాగుతున్న ఉద్రిక్తత

తైవాన్‌(Taiwan) సమీపంలో చైనా(China) సైనిక దళాలు ‘జాయింట్‌ సోర్డ్‌’ పేరిట చేపట్టిన యుద్ధవిన్యాసాలు ఆదివారం కూడా కొనసాగుతున్నాయి. డజన్ల కొద్దీ యుద్ధవిమానాలు, నౌకలను చైనా మోహరించింది. తైవాన్‌ అధ్యక్షురాలి అమెరికా పర్యటనపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ చైనా ఈ విన్యాసాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యుద్ధ విన్యాసాల్లో తైవాన్‌ను చుట్టుముట్టడంపై చైనా సైనికులు సాధన చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘ధోనీ రివ్యూ సిస్టమ్‌’ దెబ్బకు సూర్యకుమార్‌ ఔట్‌.. వీడియో వైరల్‌

ఎంఎస్ ధోనీ (MS Dhoni).. కెప్టెన్ కూల్‌గా మనందరికి సుపరిచితుడు. మైదానంలో నిర్ణయాలు చురుగ్గా తీసుకుంటూ తనదైన శైలిలో జట్టును నడిపిస్తాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో (IPL) చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథిగా ఉన్న ధోనీ తనలోని ఓ ప్రత్యేకతను మరోసారి బయటపెట్టేశాడు. ఐదుసార్లు ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇది చోటు చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. అయోధ్య రామమందిరాన్ని సందర్శించిన షిండే, ఫడణవీస్‌

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, ఉపముఖ్యమంత్రి  దేవేంద్ర ఫడణవీస్‌లు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ రామాలయాన్ని సందర్శించారు. వారు అక్కడ రామ్‌లల్లా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వీరి వెంట దాదాపు 3,000 మంది శివసేన కార్యకర్తలు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సందర్భంగా శిందే మాట్లాడుతూ అయోధ్యలో భవ్య రామాలయం నిర్మించాలన్న శివసేన వ్యవస్థాపకులు బాల్‌ ఠాక్రే  కలను ప్రధాని నరేంద్ర మోదీ పూర్తి చేస్తున్నారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని