Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Updated : 13 May 2022 17:02 IST

1. ఆ ధైర్యం చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడికి లేదు: సీఎం జగన్‌

ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలను నమ్ముకుని ముందుకు సాగుతాడని, కానీ, రాజకీయాల్లో 40ఏళ్ల ఇండస్ట్రీ అనే చెప్పుకొనే చంద్రబాబు నాయుడు మంగళగిరిలో ఓడిపోయిన సొంత పుత్రుడు.. రెండు చోట్ల పోటీ చేసి, ఎక్కడా కూడా గెలవని దత్తపుత్రుడిని నమ్ముకుని వెళ్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కోనసీమ జిల్లా మురమళ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్‌ మాట్లాడారు.  

రాజ్యసభ ఎన్నికలకు వృద్ధుడి నామినేషన్‌..!

2. 2023 మార్చి నాటికి ప్రతి పట్టణానికీ మాస్టర్‌ ప్లాన్‌ ఉండాలి: కేటీఆర్‌

వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి రాష్ట్రంలోని ప్రతి పట్టణానికీ మాస్టర్‌ ప్లాన్‌ ఉండాలని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంపై వెంగళరావునగర్‌లో మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్లు, అధికారులతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పపై దృష్టిసారించాలని కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

3. ఎస్‌బీఐ లాభాల్లో 41% వృద్ధి.. అంచనాలు తప్పిన ఫలితాలు!

ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI)’ గత ఏడాది నాలుగో త్రైమాసిక ఫలితాలను (Quarterly Results) శుక్రవారం ప్రకటించింది. స్టాండలోన్‌ నికర లాభాల్లో 41 శాతం వృద్ధి నమోదు చేసింది. జనవరి - మార్చి త్రైమాసికంలో రూ.9,114 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంకు నికర లాభం రూ.6,451 కోట్లుగా ఉంది.

4. భూమి సమీపంలోకి భారీ గ్రహశకలం..!

భారీ గ్రహశకలం ఒకటి భూమికి అత్యంత సమీపంలోకి వస్తోందని అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ‘ఆస్ట్రాయిడ్‌ 388945’గా వ్యవహరిస్తోన్న ఈ శకలం మే 16 అర్ధరాత్రి 2.48 సమయంలో భూమికి దగ్గరగా వస్తుందని పేర్కొన్నారు. ఈ గ్రహశకలం దాదాపు 1,608 అడుగుల వెడల్పు ఉందని తెలిపారు. అంటే న్యూయార్క్‌లోని ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌ కంటే ఎక్కువన్నమాట.

కుటుంబాల ఘర్షణలో కారు దగ్ధం

5. NEET PG 2022 - నీట్‌ పీజీ పరీక్ష వాయిదాకు సుప్రీం కోర్టు నిరాకరణ

మే 21న నిర్వహించనున్న నీట్‌ పీజీ-2022 పరీక్షను వాయిదా వేసేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. నీట్‌ పరీక్షను వాయిదా వేయడం వల్ల డాక్టర్ల కొరత ఏర్పడడంతోపాటు రోగులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రవేశ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను భారత అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. 

6. రెండుసార్లు ప్రధాని అయ్యారు.. ఇంకేం కావాలి..!

రెండు సార్లు ప్రధానిమంత్రిగా ఎన్నికయ్యారు.. ఇంతకంటే ఇంకేం కావాలి’ అంటూ ఓ సీనియర్ ప్రతిపక్ష నేత చేసిన వ్యాఖ్యలను నరేంద్రమోదీ గుర్తుచేసుకున్నారు. గుజరాత్‌లోని బరూచ్‌లో నిన్న జరిగిన వర్చువల్‌ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఒకరోజు ప్రతిపక్ష పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు నన్ను కలిశారు. నా రాజకీయ సిద్ధాంతాలను ఆయన ఎప్పుడూ వ్యతిరేకిస్తారు. కానీ ఆయనంటే నాకు గౌరవం. కొన్ని అంశాలపై అసంతృప్తిగా ఉన్న ఆయన నన్నొచ్చి కలిశారు. 

7. మైనార్టీలను హింసిస్తున్నారు.. గాంధీని చంపినవారిని కీర్తిస్తున్నారు: సోనియా ఫైర్‌

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ నవ సంకల్ప్‌ చింతన్‌ శిబిరం మొదలైంది. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలంతా సమాలోచనలు చేస్తున్నారు. నవ సంకల్ప్‌ పేరిట పార్టీ ప్రక్షాళన, ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీని బలమైన శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగాలంటూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ప్రారంభోపన్యాసంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రక్త నాళాల్లో ప్రమాదకర గడ్డలు!

8. ధోనీ వీడ్కోలు పలుకుతాడా? గావస్కర్‌ ఏమంటున్నాడు..!

చెన్నై కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి ఇంకా క్రికెట్‌ ఆడాలనే ఆశ ఉందని, అందుకు నిదర్శనం ఈ సీజన్‌లో అతడు ఆడిన విధానమేనని బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. చెన్నై గతరాత్రి ముంబయి చేతిలో ఓడటంతో ఈ సీజన్‌లో ఆ జట్టు ప్లేఆఫ్స్‌ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే ధోనీ భవితవ్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 

9. ట్విటర్‌ కొనుగోలు ఒప్పందం తాత్కాలికంగా నిలిపివేత!

విద్యుత్తు కార్ల సంస్థ టెస్లా, అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్‌ఎక్స్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) కీలక ప్రకటన చేశారు. ట్విటర్‌ (Twitter) కొనుగోలు ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. స్పామ్‌, నకిలీ ఖాతాలు 5 శాతం కంటే తక్కువ ఉంటాయన్న లెక్కలకు సంబంధించిన ఆధారాలను ఇంకా అందజేయాల్సి ఉందన్నారు. ఇదే ఒప్పందం నిలిపివేతకు కారణమని వివరించారు.

10. చైనా జీరో కొవిడ్‌ ఎఫెక్ట్‌.. కుంగిన ఎగుమతులు..!

జీరో కొవిడ్ పేరిట చైనా చేస్తున్న హడావుడి.. వైరస్‌ వ్యాప్తిని నిలువరించకపోగా ఆ దేశ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. తాజాగా ఎగుమతులు బాగా మందగించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సరకు రవాణాకు ఆంక్షలు అడ్డం కావడం.. ప్రధాన నగరాలు లాక్‌డౌన్‌ ఆంక్షల్లో మగ్గడం.. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి పుంజుకోవడం దీనికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. 2019 తర్వాత భారీగా పెరిగిన చైనా ఎగుమతులు ఇప్పుడు మెల్లగా తగ్గుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని