SBI Quarterly Results: ఎస్‌బీఐ లాభాల్లో 41% వృద్ధి.. అంచనాలు తప్పిన ఫలితాలు!

ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)’ గత ఏడాది నాలుగో త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది...

Published : 13 May 2022 16:53 IST

దిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI)’ గత ఏడాది నాలుగో త్రైమాసిక ఫలితాలను (Quarterly Results) శుక్రవారం ప్రకటించింది. స్టాండలోన్‌ నికర లాభాల్లో 41 శాతం వృద్ధి నమోదు చేసింది. జనవరి - మార్చి త్రైమాసికంలో రూ.9,114 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంకు నికర లాభం రూ.6,451 కోట్లుగా ఉంది. ఇక ఎస్‌బీఐ మొత్తం ఏకీకృత ఆదాయం క్రితం ఏడాది నమోదైన రూ.81,327 కోట్ల నుంచి రూ.82,613 కోట్లకు పెరిగింది. ఇక సమీక్షిస్తున్న త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన కూడా బ్యాంకు లాభం 56 శాతం పెరిగి రూ.9,549 కోట్లకు చేరింది. ఈ త్రైమాసికంలో కొత్త నిరర్థక ఆస్తులు 3.97 శాతంగా ఉన్నాయి. మొత్తంగా బ్యాంకు నికర నిరర్థక ఆస్తులు స్వల్పంగా తగ్గి 1.02 శాతానికి చేరాయి. అయితే, నాలుగో త్రైమాసిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోవడంతో సంస్థ షేర్లు ఈరోజు 3.89 శాతానికి పైగా నష్టపోయి రూ.444.65 వద్ద ముగిశాయి.

గత ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే బ్యాంకు స్టాండలోన్‌ నికర లాభాలు 55 శాతం వృద్ధి చెంది రూ.31,676 కోట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇది రూ.20,410 కోట్లుగా ఉంది. మార్చి 31, 2021తో ముగిసిన సంవత్సరానికిగానూ ఒక్కో షేరుపై రూ.7.10 (ముఖ విలువపై 710%) డివిడెండును ఇవ్వాలని బోర్డు ప్రతిపాదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని