TS EAMCET: తెలంగాణ ఎంసెట్, ఈసెట్‌ నోటిఫికేషన్లు విడుదల

తెలంగాణలో ఎంసెట్‌, ఈసెట్‌ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఎంసెట్‌కు ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి మే 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్‌ 14 నుంచి 20 వరకు

Updated : 28 Mar 2022 17:00 IST

హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్‌, ఈసెట్‌ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఎంసెట్‌కు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి మే 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్దన్ తెలిపారు. ఇంజినీరింగ్ లేదా అగ్రికల్చర్ విభాగాల కోసం ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400, ఇతరులు రూ. 800, రెండూ రాసే అభ్యర్థులు రూ.1600 చెల్లించాల్సి ఉంటుంది.

పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ గణితం చదివిన విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ఈసెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. జులై 13న జరగనున్న ఈసెట్ కు ఏప్రిల్ 6 నుంచి జూన్ 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400, ఇతరులు రూ. 800 ఫీజు చెల్లించాలని ఈసెట్‌ కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ తెలిపారు.

ప్రవేశ పరీక్షలపై ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య లింబాద్రి, ఇతర అధికారులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ నెల 23న సమీక్షించి ఎంసెట్, ఈసెట్‌ తేదీలను ప్రకటించారు. తెలంగాణ ఎంసెట్‌ జులై 14 నుంచి 5 రోజులపాటు జరగనుంది. జులై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్‌, 18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలు నిర్వహిస్తారు.  ఎంసెట్‌ను రెండు రాష్ట్రాల్లో 105 కేంద్రాల్లో జరుపుతామని తెలిపారు. పాలిటెక్నిక్‌ విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌/బీఫార్మసీ రెండో ఏడాదిలో చేరేందుకు ఈసెట్‌ను జులై 13న జరపాలని నిర్ణయించామన్నారు. ఎంసెట్‌, ఈసెట్‌కు సంబంధించి తాజాగా నోటిఫికేషన్లు విడుదల చేశారు.

ఎంసెట్‌కు కనీసం 2.50 లక్షల దరఖాస్తులు?

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌కు రెండు రాష్ట్రాల నుంచి కనీసం రెండున్నర లక్షలమంది దరఖాస్తు చేయనున్నారు. అందులో 90 శాతం తెలంగాణ విద్యార్థులే ఉంటారు. గత ఏడాది ఎంసెట్‌ ఇంజినీరింగ్‌కు 1,64,962, అగ్రికల్చర్‌, ఫార్మసీలకు 86,644. దరఖాస్తులు అందాయి. ఈసారి కూడా ఇంటర్‌ మొదటి సంవత్సరంలో తప్పిన విద్యార్థులందరినీ కనీస మార్కులతో ప్రభుత్వం పాస్‌ చేసింది. ఈ క్రమంలో భారీ సంఖ్యలోనే పోటీ పడతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండదు. అంటే ఎంసెట్‌ మార్కులతోనే ర్యాంకు కేటాయిస్తారు. 70 శాతం సిలబస్‌ ఆధారంగానే ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ పరీక్షలు జరిగాయి. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఎంసెట్‌ ప్రశ్నపత్రం రూపొందిస్తారు. ఈసెట్‌కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 25 వేలమంది పోటీపడతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని