Coronavirus: 63కు పెరిగిన జేఎన్‌.1 సబ్‌వేరియంట్ కేసులు

దేశంలో కొవిడ్‌ కొత్త వేరియంట్ జెఎన్‌.1 రకం కేసులు 63కి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

Updated : 25 Dec 2023 17:41 IST

దిల్లీ: దేశంలో కరోనా(Covid-19)కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే క్రియాశీల కేసుల సంఖ్య 4,054కి చేరింది. అలాగే కొవిడ్‌ కొత్త సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు 63కు చేరాయని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వాటిలో అత్యధికంగా గోవాలో 34 కేసులు వెలుగుచూడగా.. మహారాష్ట్రలో తొమ్మిది మంది ఈ వేరియంట్‌ బారినపడ్డారు. కర్ణాటక(8), కేరళ(6), తమిళనాడు(4), తెలంగాణ(2)లో ఈ కేసులు బయటపడినట్లు కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది.

జేఎన్‌.1 వేరియంట్‌ సోకినవారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, బాధితులు త్వరగా కోలుకునే అవకాశాలున్నాయని వైద్యులు చెప్తున్నారు. కేరళలో కొన్ని రోజుల క్రితం ఈ జేఎన్‌.1 వేరియంట్‌కు సంబంధించి తొలి కేసు బయటపడింది. 79 ఏళ్ల మహిళకు ఇది సోకింది. అయితే ఆమె ఇంట్లోనే ఉండి పూర్తిగా కోలుకున్నారని.. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారన్నారు. ఈ ఉపరకం కేసులు ఇప్పటికే పలు దేశాల్లో వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. అమెరికా, చైనా, సింగపూర్‌లతోపాటు భారత్‌లోనూ ఈ కేసులు నమోదైనట్లు తెలిపింది. దీన్ని ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’గా పేర్కొన్న డబ్ల్యూహెచ్‌వో.. ఇది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని పేర్కొంది.

‘వ్యాక్సిన్‌ అదనపు డోస్‌ అవసరం లేదు’

 ప్రస్తుత శీతాకాల సీజన్‌ పరిగణనలోకి తీసుకొని కొవిడ్ నియంత్రణ చర్యలపై దృష్టి సారించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి.. రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. జేఎన్‌.1 గురించి ప్రజలు ఆందోళన చెందకుండా.. అప్రమత్తంగా ఉంటే దీని వ్యాప్తిని తేలిగ్గా అడ్డుకోవచ్చని వైద్య నిపుణులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని