Delhi: కోర్టు ఆదేశాలను కేంద్రం ధిక్కరిస్తోంది: బదిలీల వివాదంలో సుప్రీం చెంతకు కేజ్రీవాల్‌

కేంద్రం వ్యవహారశైలిని తప్పు పడుతూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) మరోసారి సుప్రీం మెట్లెక్కారు. దిల్లీ ప్రభుత్వంలోని సేవల విభాగం కార్యదర్శి ఆశీష్‌ మోరెను ఆ పదవి నుంచి తప్పించడం ప్రస్తుత వివాదానికి కారణం.  

Published : 12 May 2023 14:39 IST

దిల్లీ: కేంద్రం కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌(Delhi CM Arvind Kejriwal) శుక్రవారం సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. తీర్పు ప్రకారం తాను తీసుకుంటోన్న చర్యలకు అడ్డుతగులుతోందని, దిల్లీ ప్రభుత్వ సేవల విభాగం కార్యదర్శి ఆశీష్‌ మోరె బదిలీని అమలు చేయడం లేదంటూ తన పిటిషన్‌లో ఆరోపించారు. ఐఏఎస్‌లు సహా ఇతర అధికారుల బదిలీలు, నియామకాలపై దిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని నిన్న సుప్రీం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి చర్యలు ప్రారంభించారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే అధికారుల భరతం పడతానని హెచ్చరించిన ఆయన.. ఆశీష్‌ను విధుల నుంచి తప్పించారు. ఇదే ప్రస్తుత వివాదానికి కారణమైంది. 

ఈ విషయాన్ని దిల్లీ ప్రభుత్వం తరఫున ఏఎమ్‌ సింఘ్వీ.. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ‘మేం ఎవరిని బదిలీ చేయమని వారు చెప్తున్నారు. నిన్న ఇచ్చిన తీర్పు ప్రకారం నేను ధిక్కరణ పిటిషన్ వేయొచ్చు. కానీ, దానికి సమయం పడుతుంది. అందుకే మీరు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాను’ అని సింఘ్వీ కోర్టుకు వెల్లడించారు. వచ్చేవారం దీనిపై వాదనలు వినేందుకు ప్రధాన న్యాయమూర్తి అంగీకరించారు. అందుకోసం ఓ బెంచ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే ఆప్‌(AAP) సర్కార్‌ ఆశీష్‌ మోరెను బదిలీ చేసి, ఆయన స్థానంలో దిల్లీ జల్‌ బోర్డు మాజీ సీఈవో ఎ.కె.సింగ్‌ను నియమించింది. పరిపాలనాపరంగా రానున్న రోజుల్లో భారీగా మార్పులుంటాయని, ఇప్పటి వరకు చేసిన పనుల ఆధారంగా చాలా మంది అధికారులను బదిలీ చేస్తామని కేజ్రీవాల్‌ చెప్పారు. ప్రజావసరాలకు ఆటంకం కలిగిస్తున్న అధికారులు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరికలు పంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని