కరోనా ఉద్ధృతి.. కేంద్రం నూతన మార్గదర్శకాలు

దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి మళ్లీ కొనసాగుతున్న వేళ కేంద్ర హోంశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టులు, ట్రేసింగ్‌, చికిత్సపై రాష్ట్రాలు, కేంద్రపాలిత

Updated : 23 Mar 2021 20:00 IST

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి మళ్లీ కొనసాగుతున్న వేళ కేంద్ర హోంశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టులు, ట్రేసింగ్‌, చికిత్సపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరింత దృష్టిపెట్టాలని ఆదేశించింది. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. నూతన మార్గదర్శకాలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏప్రిల్‌ 30 వరకు ఇవి వర్తిస్తాయని కేంద్రం పేర్కొంది. 

కేంద్రం మార్గదర్శకాలివే..

* రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు పెంచాలి. పాజిటివ్‌ వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందించాలి. ఆ తర్వాత వారు ఎవరెవరిని కలిశారో ట్రేసింగ్‌ చేపట్టాలి. 

* పాజిటివ్‌ కేసులను బట్టి కంటైన్మెంట్‌జోన్‌లను ప్రకటించాలి. ఈ వివరాలను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్లో పొందుపర్చాలి. కంటైన్మెంట్‌ జోన్‌లలో ఇంటింటి సర్వే చేపట్టి పరీక్షలు చేయాలి.

* బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, రద్దీప్రాంతాల్లో ప్రజలు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించేలా అన్ని చర్యలు చేపట్టాలి. మాస్క్‌లు, సామాజికదూరం పాటించేలా చూడాలి. నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నవారిపై అవసరమైతే జరిమానా వంటి చర్యలు కూడా తీసుకోవచ్చు.

* స్థానిక పరిస్థితులను బట్టి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆంక్షలు విధించుకోవచ్చు. 

* అయితే రాష్ట్రాల మధ్య, రాష్ట్రం లోపల రాకపోకలపై ఎలాంటి నిషేధం లేదు. వ్యక్తులు, సరకు రవాణా కోసం రాష్ట్రాల మధ్య ఎలాంటి అనుమతులు అవసరం లేదు. 

* కంటైన్మెంట్‌ జోన్‌ వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతి ఉంది. అయితే ప్రయాణికుల రైళ్లు, విమానాలు, మెట్రో రైళ్లు, స్కూళ్లు, విద్యాసంస్థలు, హోటళ్లు, రెస్టారంట్లు, షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లు, పార్కులు, జిమ్‌ సెంటర్లు తదితర వాటిల్లో మాత్రం నిర్దేశిత ప్రమాణాలు(ఎస్‌ఓపీలు) అమల్లో ఉంటాయి. వీటికి లోబడే కార్యకలాపాలు నిర్వహించేలా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. 

* ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియను భారత్‌ ప్రారంభించింది. అయితే ఇంకా కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో టీకా పంపిణీ నెమ్మదిగా సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్‌ వ్యాప్తి చైన్‌ను విడగొట్టాలంటే టీకానే ఆధారం. అందువల్ల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాక్సినేషన్‌పై మరింత దృష్టిపెట్టాలి. అర్హులైన వారందరూ టీకా వేయించుకునేలా చూడాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని