పుస్తకాలు.. యోగా.. ధ్యానం

తిహాడ్‌ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎక్కువ సమయాన్ని పుస్తక పఠనానికి, యోగా, ధ్యానాలకు ఉపయోగించుకుంటున్నారు.

Published : 05 Apr 2024 05:15 IST

తిహాడ్‌ జైల్లో కేజ్రీవాల్‌ దినచర్య

దిల్లీ: తిహాడ్‌ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎక్కువ సమయాన్ని పుస్తక పఠనానికి, యోగా, ధ్యానాలకు ఉపయోగించుకుంటున్నారు. రోజులో రెండుసార్లు గంటన్నరసేపు చొప్పున ధ్యానం, యోగా చేస్తున్నారు. ‘నిబంధనల ప్రకారం, అందరి ఖైదీల మాదిరిగానే కేజ్రీవాల్‌కు తన సెల్‌ను శుభ్రం చేసుకునేందుకు ఒక చీపురు, బకెట్‌ అందించాం. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఒక టేబుల్‌, కుర్చీ, విద్యుత్తు కెటిల్‌ కూడా అందుబాటులో ఉంచాం. సెల్‌లో అమర్చిన రెండు సీసీ కెమెరాలతో ఆయన్ను 24 గంటలూ జైలు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సెల్‌ బయట ఉన్న చిన్న లాబీలో నడిచేందుకు వెసులుబాటు ఉంది’ అని వివరించాయి. భద్రతా కారణాల వల్ల తోటి ఖైదీలతో కలిసేందుకు ఆయన్ని అనుమతించడం లేదని సమాచారం.

ప్రజాసమస్యల పరిష్కారానికి ఆదేశం

ఎమ్మెల్యేలంతా వారివారి నియోజకవర్గాలను సందర్శించి, సమస్యల్ని పరిష్కరించాలని కేజ్రీవాల్‌ ఆదేశించారు. జైలు నుంచి ప్రజాప్రతినిధులకు పంపిన ఈ వినతిని ఆయన భార్య సునీత ఓ వీడియో సందేశం ద్వారా వెల్లడించారు. తన న్యాయవాదితో మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇవ్వాలని కేజ్రీవాల్‌ చేసిన విజ్ఞప్తిని ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం పరిశీలించనుంది. కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన మరో ప్రజా ప్రయోజన పిటిషన్‌ (పిల్‌)ను విచారణకు స్వీకరించేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించింది. హిందూసేన అధ్యక్షుడు విష్ణు గుప్తా వేసిన పిల్‌ను జస్టిస్‌ మన్మోహన్‌, జస్టిస్‌ మన్మీత్‌ ప్రీతమ్‌ సింగ్‌ అరోడాతో కూడిన ధర్మాసనం గురువారం కొట్టేసింది.


రేవంత్‌రెడ్డినీ అరెస్టు చేస్తారు: సంజయ్‌

దిల్లీ, ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రులను జైలుకు పంపడం దేశంలో నియంతృత్వం మొదలైందనడానికి నిదర్శనమని ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ అన్నారు. తిహాడ్‌ జైలు నుంచి విడుదలైన ఆయన గురువారం మాట్లాడారు. ‘స్టాలిన్‌ (తమిళనాడు), రేవంత్‌రెడ్డి (తెలంగాణ), భగవంత్‌మాన్‌ (పంజాబ్‌) వంటి భాజపాయేతర ముఖ్యమంత్రులను కూడా అరెస్టు చేసి, రాజీనామా చేయించడానికి భాజపా సిద్ధమవుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ప్రమాదకరం’ అని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని