Covid 19: పెరుగుతోన్న ఇన్‌ఫెక్షన్లు.. తెలంగాణ సహా 6 రాష్ట్రాలకు కేంద్రం అలెర్ట్‌..!

దేశంలో పలుచోట్ల కొవిడ్‌ (Covid 19) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 6 రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry).. వైరస్‌ కట్టడి చర్యలు చేపట్టాలని సూచించింది.

Published : 16 Mar 2023 20:13 IST

దిల్లీ: కొన్ని రోజులుగా దేశంలో పలుచోట్ల కొవిడ్‌ కేసులు (Covid 19), వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇన్‌ఫెక్షన్ల ప్రభావం అధికంగా ఆరు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) లేఖ రాసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ వైరస్‌ కట్టడి చర్యలు చేపట్టాలని సూచించింది. ఆయా ప్రాంతాల్లో టెస్టుల (Corona Test) సంఖ్య పెంచడంతోపాటు వ్యాక్సినేషన్‌పైనా (Vaccination) దృష్టి పెట్టాలని పేర్కొంది.

కొన్ని వారాలుగా దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మార్చి 8నాటికి దేశంలో మొత్తం 2082 క్రియాశీల కేసులు ఉండగా.. తదుపరి వారంలోనే అవి 3264కు చేరుకున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు గుర్తించింది. కర్ణాటకలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 2.77గా ఉండగా, కేరళలో 2.64శాతం, తమిళనాడులో 1.99శాతం, మహారాష్ట్రలో 1.92శాతం, గుజరాత్‌లో 1.11శాతం, తెలంగాణలో 0.31శాతం పాజిటివిటీ రేటు ఉందని తెలిపింది.

ఈ నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో వైరస్‌ కట్డడి చర్యలు చేపట్టాలని సూచిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ ఆయా రాష్ట్రాలకు లేఖ రాశారు. ఇన్‌ఫ్లుయెంజాతోపాటు కొవిడ్‌ ప్రభావాన్ని పర్యవేక్షిస్తూ టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌, వ్యాక్సినేషన్‌ వ్యూహాన్ని అమలు చేయాలని సూచించారు. వీటితోపాటు అంతర్జాతీయ ప్రయాణికులతోపాటు వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో నమూనాలను సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టాలని పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, కొవిడ్‌-19 కేసులు పెరుగుతోన్న సమయంలోనే అటు హెచ్‌3ఎన్‌2 వ్యాప్తి కూడా పలు రాష్ట్రాల్లో కొనసాగుతోంది.  కొవిడ్‌ తరహా లక్షణాలున్న ఈ ఇన్‌ఫ్లుయెంజా (Influenza) కేసులతో శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడి ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.  ఇప్పటివరకు 450పైగా హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కేసులు నమోదుకాగా.. ఇన్‌ఫ్లుయెంజా కారణంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని