Manipur: అక్రమ వలసదారులను గుర్తించేందుకు మణిపుర్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

మణిపుర్‌లో హింసకు మయన్మార్‌ నుంచి వచ్చిన శరణార్థులతోపాటు, నార్కో టెర్రరిజమ్‌ కూడా కారణమని ఇంటెలిజెన్స్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే మయన్మార్‌(Myanmar) నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి ప్రవేశించిన వారిని గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు.

Updated : 30 Jul 2023 14:09 IST

ఇంఫాల్: జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌(Manipur)లో శాంతి నెలకొల్పేందుకు అధికారులు దిద్దిబాటు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా మయన్మార్‌(Myanmar) నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి ప్రవేశించిన వారిని గుర్తించే ప్రక్రియను చేపట్టారు. ఇందుకోసం మణిపుర్‌ ప్రజల నుంచి బయోమెట్రిక్‌ డేటాను సేకరిస్తున్నట్లు ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. ‘‘మయన్మార్‌ నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి ప్రవేశించి.. ఇక్కడే ఉంటున్న వారిని గుర్తించేందుకు బయోమెట్రిక్‌ డేటా సేకరణ ప్రారంభించాం. ఈ ప్రక్రియ సెప్టెంబరు చివరినాటికి పూర్తి చేస్తాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి డేటా సేకరించేందుకు జాతీయ నేరాల నమోదు సంస్థ (NCRB) నుంచి మణిపుర్‌కు ప్రత్యేక బృందాలు వచ్చాయి’’ అని మణిపుర్‌ హోంశాఖ జాయింట్ సెక్రటరీ పీటర్‌ సలామ్‌ తెలిపారు. 

మణిపుర్‌లో రంగంలోకి సీబీఐ

మణిపుర్‌లో హింసకు మయన్మార్‌ నుంచి వచ్చిన శరణార్థులతోపాటు, నార్కో టెర్రరిజమ్‌ కూడా కారణమని ఇంటెలిజెన్స్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే మయన్మార్‌ నుంచి మణిపుర్‌కు అక్రమంగా ఆయుధాలు సరఫరా చేస్తున్న వ్యక్తులను రెండు నెలల క్రితం ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. గత వారం, రెండు రోజుల వ్యవధిలో సుమారు 700 మంది సరైన ప్రయాణ పత్రాలు లేకుండా మయన్మార్‌ నుంచి మణిపుర్‌లోకి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ముందుగా అక్రమ వలసదారులను గుర్తించి వారిని తిరిగి మయన్మార్‌కు పంపేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు కల్లోలిత మణిపుర్‌లో ‘ఇండియా’ కూటమి నేతలు పర్యటించారు. బాధిత కుంటుంబాలను పరామర్శించారు. దేశంలోని అన్ని పార్టీలు కలిసి మణిపుర్ సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని కూటమి నేతలు అభిప్రాయపడ్డారు.

గవర్నర్‌ను కలిసిన ‘ఇండియా’ నేతలు

మణిపుర్‌లో పర్యటిస్తున్న ‘ఇండియా’ కూటమి నేతలు ఆదివారం ఉదయం గవర్నర్‌ అనుసూయ ఉకేను కలిశారు. ఇంఫాల్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయిన 21 మంది ఎంపీలు మెమోరాండం సమర్పించారు. మణిపుర్‌లో శాంతి పునరుద్ధరించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు