PM modi: ఫ్రంట్లైన్ వర్కర్లకు బూస్టర్ డోసు.. ప్రధాని మోదీ ప్రకటన
ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతున్న వేళ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. జనవరి 10వ తేదీ నుంచి ఫ్రంట్లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు బూస్టర్ డోసు.......
దిల్లీ ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతున్న వేళ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. జనవరి 10వ తేదీ నుంచి హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్లకు బూస్టర్ డోసు అందిస్తామని ప్రకటించారు. వీరితో పాటు 60ఏళ్లు పైబడి అనారోగ్య సమస్యలతో ఉన్న వృద్ధులకు (వైద్యుల సలహా మేరకు) కూడా అదనపు డోసు పంపిణీ చేస్తామని వెల్లడించారు. అలాగే, 15 నుంచి 18 ఏళ్ల వయసు వారికి జనవరి 3 నుంచి టీకా పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. శనివారం రాత్రి ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘‘దేశంలో 90 శాతం వయోజనులకు కొవిడ్ టీకా తొలి డోసు పంపిణీ పూర్తయింది. ఒమిక్రాన్పై రకరకాల వార్తలు, వదంతులు వస్తున్నాయి. వ్యాక్సిన్ తయారీ, పంపిణీ కోసం నిరంతరం పనిచేస్తున్నాం. ఆరోగ్య కార్యకర్తల అంకితభావం వల్లే టీకా పంపిణీ వడివడిగా సాగుతోంది. రానున్న రోజుల్లో వ్యాక్సినేషన్ను మరింత వేగవంతం చేస్తాం’’ అని మోదీ అన్నారు.
ఔషధాలకు ఎలాంటి కొరతా లేదు
‘‘దేశంలో కరోనా ఇంకా పూర్తిగా నిర్మూలన కాలేదు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ అందరం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది. ఒమిక్రాన్ వస్తోంది.. ఎవరూ భయాందోళనకు గురికావొద్దు. కొత్త వేరియంట్ వల్ల పలు ప్రపంచ దేశాల్లో ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. మన దేశంలో కూడా కొన్ని కేసులు వచ్చాయి. ఎవరూ భయాందోళనకు గురికావొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మాస్కులు, శానిటైజర్లు నిత్యం వాడండి. అప్రమత్తంగా ఉండండి. ఈరోజు దేశంలో 18లక్షల ఐసోలేషన్ పడకలు, ఐదు లక్షల ఆక్సిజన్ సపోర్టెడ్ పడకలు, 1.4లక్షల ఐసీయూ పడకలు, చిన్నారులకు 90వేల ప్రత్యేక బెడ్లు సిద్ధంగా ఉన్నాయి. అలాగే, 3వేలకు పైగా పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు, నాలుగు లక్షల ఆక్సిజన్ సిలిండర్లు అన్ని రాష్ట్రాలకు సమకూర్చాం. దేశంలో ఔషధాలకు ఎలాంటి కొరతా లేదు’’ అని ప్రధాని చెప్పారు.
ఒమిక్రాన్ నివారణకు ఇవే మందు..!
‘‘ఒమిక్రాన్ నివారణకు టీకాలు, జాగ్రత్తలే మందు. అనేక రాష్ట్రాల్లో 100 శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయింది. కొత్త సంవత్సరం కోసం అంతా ఆతృతతో ఎదురుచూస్తున్నాం.. కానీ ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడం మరిచిపోవద్దు. వైద్య సిబ్బంది కఠోర శ్రమవల్లే 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. 11 నెలలుగా దేశంలో వ్యాక్సినేషన్ ఉద్యమం కొనసాగుతోంది’’ అని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.