
South Africa: ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా.. ఆస్పత్రి చేరికలు తక్కువే!
ఆందోళన అవసరం లేదన్న దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా
జోహెన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తృత వేగంగా వ్యాపిస్తోంది. దీంతో ఆ దేశంలో కేసుల సంఖ్య రోజురోజుకు రెట్టింపవుతోంది. ప్రమాదకరంగా భావిస్తోన్న ఈ వేరియంట్ ఇప్పటికే 30కిపైగా దేశాలకు విస్తరించింది. దీంతో ఆయా దేశాలు కట్టడి చర్యలు ముమ్మరం చేశాయి. అయితే, ఒమిక్రాన్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నప్పటికీ తీవ్ర వ్యాధితో ఆస్పత్రుల్లో చేరికలు తక్కువగానే ఉంటున్నట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా వెల్లడించారు. ఈ వేరియంట్ కారణంగా ఆందోళనకర పరిస్థితులు తలెత్తే ప్రమాదం కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం ఘనా పర్యటనలో ఉన్న ఆయన.. దక్షిణాఫ్రికా ప్రయాణాలపై పలు దేశాలు ఆంక్షలు విధించడాన్ని తప్పుబట్టారు.
‘మరిన్ని పరీక్షలతో పాటు ఈ వేరియంట్ సంక్రమణపై పరిశోధనలు చేయాల్సి ఉంది. ఆస్పత్రుల్లో చేరికలు కూడా భారీ స్థాయిలో ఉండడం కనిపించడం లేదు. ఇది ఎంతో ఊరట కలిగించే విషయం’ అని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా వెల్లడించారు. కొత్త వేరియంట్ వేగంగా సంక్రమణ చెందుతున్నప్పటికీ ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని అక్కడి ఆరోగ్యశాఖ మంత్రి జో ఫాహ్లా పేర్కొన్నారు. ఆస్పత్రి చేరికలను పరిశీలిస్తే ఈ వేరియంట్ వల్ల స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని అన్నారు.
ఇదిలాఉంటే, దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్ వెలుగు చూసినప్పటి నుంచి అక్కడి క్రియాశీల కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఈ వేరియంట్ తొలుత బయటపడిన నాటికి అక్కడ దాదాపు 19వేల క్రియాశీల కేసులుండగా నవంబర్ చివరి నాటికి ఆ సంఖ్య 75 వేరకు పెరిగింది. వీటిలో అధికంగా కొత్త వేరియంట్ కేసులే ఉంటున్నాయి. ఇలా వైరస్ సంక్రమణ రేటు ఎక్కువగా ఉండడం వల్లే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దాన్ని ఆందోళనకర వేరియంట్గా ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన ప్రపంచ దేశాలు దక్షిణాఫ్రికా నుంచి అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలను విధిస్తున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.