వెండితెర బలం... స్వరాజ్య గళం

దేశభక్తిని మించిన భావోద్వేగం మరొకటి ఏముంటుంది? తెరపై స్వాతంత్య్ర పోరాట యోధుడి వేషంలో ఓ నటుడు కనిపించినా చాలు... ఇట్టే చప్పట్లు కొడతాం.

Updated : 15 Aug 2022 07:47 IST

దేశభక్తిని మించిన భావోద్వేగం మరొకటి ఏముంటుంది? తెరపై స్వాతంత్య్ర పోరాట యోధుడి వేషంలో ఓ నటుడు కనిపించినా చాలు... ఇట్టే చప్పట్లు కొడతాం. పౌరుషంతో ఓ సంభాషణ  చెప్పారంటే చాలు... మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తెల్లదొరల పాలనలో మనం ఎలా అన్యాయానికి గురయ్యామో మచ్చుకు కొంచెం చూపించినా మన రక్తం మరిగిపోతుంది. కులం, మతం, ప్రాంతం అనే భేదం లేకుండా అందరినీ  ఒకే స్థాయిలో కదిలించే ఓ గొప్ప భావోద్వేగం... దేశభక్తి. అందుకే మాతృభూమి గురించి, స్వరాజ్యం గురించి స్పృశించే ఏ చిన్న అవకాశం వచ్చినా  వదలుకోదు మన సినిమా. ఎన్నెన్ని కథలుగా చెప్పినా తరగని పోరాటాలు, ప్రాణ త్యాగాలతో కూడిన గొప్ప ఉద్యమ చరిత్ర మనది. అవకాశం దొరికినప్పుడంతా ఆ త్యాగాల్ని గుర్తు చేస్తూ ప్రేక్షకుల్లో స్ఫూర్తిని రగిలిస్తోంది సినిమా. స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలోనూ, ఆ తర్వాత మన సినిమా దేశభక్తిని ఎలా ప్రదర్శించిందో అమృతోత్సవాల సందర్భంగా ఓ సారి గుర్తు  చేసుకుందాం.

తెలుగులో రూపొందిన తొలి సాంఘిక చిత్రం ‘ప్రేమవిజయం’. 1936లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అప్పటిదాకా పౌరాణిక కథలే మన ప్రేక్షకులకు పరిచయం. తొలిసారి ఒక సాంఘిక కథతో వచ్చిన ఈ సినిమాలోనే స్వాతంత్య్ర కాంక్ష కనిపిస్తుంది. ఆ తర్వాత రూపొందిన పలు సాంఘిక చిత్రాల్లోనూ అప్పటికే సమాజంలో వేళ్లూనుకుపోయిన దురాచారాల్ని విమర్శిస్తూ, దేశభక్తిని చాటిచెబుతూ, స్వరాజ్య బాణీని వినిపించే ప్రయత్నం చేశారు. ‘మాల పిల్ల’, ‘మళ్ళీ పెళ్ళి’, ‘రైతు బిడ్డ’, ‘వందేమాతరం’, ‘సుమంగళి’, ‘దేవత’ తదితర చిత్రాల్లో దేశభక్తి ప్రధానంగా సాగే సన్నివేశాలు కనిపిస్తాయి.

బ్రిటిష్‌ ప్రభుత్వ నిషేధం
గూడవల్లి రామబ్రహ్మం రూపొందించిన ‘రైతుబిడ్డ’ అప్పటి జమిందారీ వ్యవస్థని విమర్శిస్తూ రూపొందింది. ఆ సినిమా ప్రదర్శనని కొన్నిచోట్ల నిషేధించింది బ్రిటిష్‌ ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి సానుభూతి పరులైన కొద్దిమంది జమిందార్ల కోరికతోనే ఆ ప్రయత్నం చేసింది. ‘వందేమాతరం’ సినిమాకీ అదే పరిస్థితి ఎదురైంది. బ్రిటిష్‌ పాలనలో భారతీయులు ఎదుర్కొంటున్న నిరుద్యోగం, సంఘంలోని వరకట్నం దురాచారాలపై ఎక్కుపెట్టి తీసిన చిత్రమది.

1947లో విడుదలై..

1941లో మహాత్మాగాంధీ ఆశయాలతో ‘మహాత్మాగాంధీ’ చిత్రం రూపొందింది. ఆ సినిమా అప్పట్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. డాక్యుమెంటరీ తరహాలో రూపొందడమే కారణం అంటారు. 1946లో గూడవల్లి రామబ్రహ్మం ‘పల్నాటియుద్ధం’ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమా పూర్తి కాక ముందే ఆయన కన్నుమూయడంతో, మిగిలిన సినిమాని ఎల్‌.వి.ప్రసాద్‌ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 1947లో విడుదలైన ఈ సినిమాలో తెల్లదొరల పాలనని విమర్శించే పౌరుషమైన సంభాషణలు వినిపిస్తాయి.

దేశం కోసం ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా తెల్లవారిని ఎదురించిన పోరాట యోధుల జీవితాల ఆధారంగా విరివిగా సినిమాలు రూపొందాయి. కృష్ణ నటించిన ‘అల్లూరి సీతారామరాజు’, శివాజీ గణేశన్‌ ‘వీర పాండ్య కట్ట బొమ్మన్‌’, విజయ్‌ చందర్‌ ‘ఆంధ్రకేసరి’, చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ తదితర చిత్రాలు ఆ కోవకి చెందినవే. వెంకటేష్‌ ‘సుభాష్‌ చంద్రబోస్‌’ చిత్రంతో స్వాత్రంత్ర స్ఫూర్తిని రగిలించారు. ‘బొబ్బిలియుద్ధం’, ‘తాండ్ర పాపారాయుడు’, ‘సర్దార్‌ పాపారాయుడు’, ‘మేమూ మనుషులమే’, ‘నాడు నేడు’ తదితర చిత్రాలు స్వతంత్ర పోరాటం నేపథ్యంగా రూపొందినవే. అల్లూరి సీతారామరాజు పాత్రపై మన కథానాయకులు ఎంతోమంది మక్కువ ప్రదర్శించారు. కృష్ణ ఆ పాత్రపై తనదైన ముద్రవేయగా, ఎన్టీఆర్‌ పలు చిత్రాల్లో అల్లూరిగా మెరిశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా సందడి చేశారు.

* నేటి సినిమాల విషయానికొస్తే కమల్‌హాసన్‌ ‘భారతీయుడు’ మొదలుకొని ఈ ఏడాదే విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వరకు ఎన్నో సినిమాలు స్వతంత్ర సంగ్రామాన్ని ఆవిష్కరిస్తూ దేశభక్తిని చాటాయి. ‘రోజా’ మొదలుకొని ‘ఖడ్గం’, ‘మహాత్మ’, ‘ఘాజీ ఎటాక్‌’, ‘ఉరి’, ‘సీతారామం’ వరకు ఎన్నో సినిమాలకి దేశభక్తి ప్రధానంగా సాగే భావోద్వేగాలే కీలకం. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరిగా రామ్‌చరణ్‌ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దేశ విదేశాల్లోని ప్రేక్షకుల్ని అమితంగా అలరించింది. అమెరికాకి చెందిన వెరైటీ పత్రిక ప్రకటించిన ఆస్కార్‌ పురస్కారానికి ఆస్కారమున్న సినిమాలు, నటుల జాబితాలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి, దర్శకుడు రాజమౌళికి, కథానాయకుడు ఎన్టీఆర్‌కి చోటు దక్కడం విశేషం. ఇలా అద్భుతంగా ఆవిష్కరిస్తే... స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో వీరగాథలెన్నో ప్రపంచ సినిమా వేడుకలో చోటు సంపాదిస్తాయి. మన పోరాట పటిమ ప్రపంచానికి తెలుస్తుంది.


తొలిసారి సెట్లో జెండా ఆవిష్కరణ

మన దేశానికి స్వాతంత్య్రం లభించిన ఘడియల్లో చిత్తూరు నాగయ్య ‘భక్తజనా’ సినిమా చిత్రీకరణలో ఉన్నారు. సెట్లోనే ఆ విషయాన్ని తెలుసుకున్న చిత్తూరు నాగయ్య శాంతకుమారి తదితరులు అప్పటికప్పుడు జాతీయ పతాక ఆవిష్కరణకి ఏర్పాట్లు చేశారట. నాగయ్య చేతులమీదుగా పతాకావిష్కరణ చేశారు. తెలుగు సినిమా రంగానికి సంబంధించి తొలి స్వాతంత్య్ర దినోత్సవం ‘భక్తజనా’ సెట్లో జరిగిన పతకావిష్కరణ అనే చెబుతారు.అంతకుమునుపే చిత్తూరు నాగయ్య సత్యాగ్రహంలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ గాయకుడు ఘంటసాల క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు.


స్వతంత్ర గానం

‘తెలుగు వీర లేవరా... దీక్షబూని సాగరా... దేశమాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయరా...’  (అల్లూరి సీతారామరాజు)

స్వాతంత్య్రం సిద్ధించాక ఆ ఆనందాన్ని, ఆ సంబరాల్ని గుర్తు చేస్తూ పలు చిత్రాల్లో పాటలు వినిపించాయి. 1948లో విడుదలైన ‘బాలరాజు’ చిత్రంలో స్వతంత్రం సిద్ధించిన సంతోషాన్ని పరోక్షంగా ప్రతిబింబించేలా ‘నవోదయం శుభోదయం నవయుగ శోభామహోదయం’ అంటూ పాట సాగుతుంది. 1949లో మీర్జాపూర్‌ రాజా  నిర్మాణంలో ‘మనదేశం’ రూపొందింది. ఇందులో నటించడంతోపాటు, నిర్మాణంలో భాగం పంచుకున్నారు కృష్ణవేణి. ఎన్టీఆర్‌ని తెరకు పరిచయం చేసిన ఈ సినిమా విశేషాల్ని ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు కృష్ణవేణి. 

1947 ఆగస్టు 15 తర్వాత స్వరాజ్యం సిద్ధించిన ఉత్సాహాన్ని చాటి చెప్పేలా ఎన్నో పాటలు రూపుదిద్దుకొన్నాయి. మొదట ప్రైవేటు గీతాలుగా బయటికొచ్చిన అవి ఆ తర్వాత సినిమాల్లోనూ వినిపించాయి. ‘స్వాతంత్య్రము మా జన్మహక్కని చాటండీ...’, ‘మ్రోయింపుము జయభేరీ’, ‘ఓహోహో స్వాతంత్య్ర దేవీ ఏవీ నీవిచ్చెడి కానుకలేవీ..’, ‘హే భారత జననీ...’, ‘దేశమును ప్రేమించుమన్నా..’, ‘ఉదయమ్మాయెను... స్వేచ్ఛా భారత ఉదయమ్మాయెను’, వంటి పాటలు అప్పట్లో వినిపించాయి. ఏఎన్నార్‌ ‘వెలుగునీడలు’లో ‘పాడవోయి భారతీయుడా...’ అంటూ  సందేశాత్మక గీతం వినిపిస్తుంది. ఎన్టీఆర్‌ నటించిన ‘కోడలు దిద్దిన కాపురం’, ‘బడిపంతులు’ మొదలుకొని ‘మేజర్‌ చంద్రకాంత్‌’ వరకు పలు చిత్రాల్లోని పాటలు స్వాతంత్య్ర పోరాట యోధుల్ని గుర్తు చేస్తాయి. ‘నా జన్మభూమి ఎంతో అందమైన దేశమూ... నా ఇల్లు అందులో చక్కనీ ప్రదేశమూ’ మొదలుకొని ‘దేశం మనదే తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే’ వరకు ఎన్నో సినిమా పాటలు మన జెండా పండగలో భాగం అవుతున్నాయి.


‘పుణ్యభూమి నాదేశం నమో నమామి... ధన్యభూమి నా దేశం సదాస్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామీ...  (మేజర్‌ చంద్రకాంత్‌)


పాడవోయి భారతీయుడా... ఆడిపాడవోయి విజయగీతికా... నేడే స్వాతంత్య్ర దినం... వీరుల త్యాగఫలం... నేడే నవోదయం నీదే ఆనందం (వెలుగు నీడలు)


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని