NTR: ఎన్టీఆర్‌ మళ్లీ పుట్టాల్సిందే

‘‘ఆ రోజుల్లో శ్రీదేవితో కలిసి ఎన్టీఆర్‌ డ్యాన్స్‌ చేస్తుంటే... ‘ఆహా ఏం చేశారు’ అంటూ వాళ్ల నటనని మెచ్చుకునేవాళ్లే తప్ప, వాళ్ల వయసు గురించి ఎవరూ మాట్లాడేవాళ్లు కాదు. కేవలం వాళ్ల పాత్రలే తెరపై కనిపించేవి.

Updated : 04 Jun 2023 14:08 IST

‘‘ రోజుల్లో శ్రీదేవితో కలిసి ఎన్టీఆర్‌ డ్యాన్స్‌ చేస్తుంటే... ‘ఆహా ఏం చేశారు’ అంటూ వాళ్ల నటనని మెచ్చుకునేవాళ్లే తప్ప, వాళ్ల వయసు గురించి ఎవరూ మాట్లాడేవాళ్లు కాదు. కేవలం వాళ్ల పాత్రలే తెరపై కనిపించేవి. కానీ ఇప్పుడు సినమా ఓ సర్కస్‌లా మారింది. విషాదకరమైన పాటల్లోనూ డ్యాన్సులు వేస్తూ కనిపిస్తున్నార’’న్నారు ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు. విఖ్యాత నటులు ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా  ఇటీవల హైదరాబాద్‌లో పలువురు సినీ ప్రముఖులకి ఎన్టీఆర్‌ మెమోరియల్‌ పురస్కారాల్ని ప్రదానం చేశారు. సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్‌తోపాటు ప్రభ, శివకృష్ణ,  రోజారమణి, కవిత, తనికెళ్ల భరణి, బాబు మోహన్‌, కైకాల నాగేశ్వరరావు, బుర్రా సాయిమాధవ్‌, కొమ్మినేని వెంకటేశ్వరరావు, గుబ్బా సురేష్‌కుమార్‌ తదితర సినీ ప్రముఖుల్ని ఈ వేదికపై సత్కరించారు. ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ  ‘‘రామారావు మళ్లీ పుడితే తప్ప ఈ భూమిపై ఇంకో రామారావు లేరు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, శోభన్‌బాబు, కృష్ణ... వీళ్లు ఎంత పారితోషికం తీసుకున్నారనేది ఎవరికైనా తెలుసా? వాళ్లు ఏ రోజూ పారితోషికాల గురించి బాహాటంగా మాట్లాడేవారు కాదు. కానీ ఇప్పుడు రోజుకి ఇన్ని రూ.కోట్లు తీసుకుంటున్నాం అని చెబుతున్నారు కొంతమంది. ఇది మంచి పద్ధతి కాదు’’ అన్నారు. చిత్ర పరిశ్రమలో నటుల పరిస్థితి గురించి ఆయన మాట్లాడుతూ ఎంతమంది నటులు రెండు పూటలా భోజనం చేస్తున్నారో మా అసోసియేషన్‌ పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న నటులు బతకలేని పరిస్థితులు ఉన్నాయని, ప్రకటనల్లోనూ స్టార్లే నటిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో లొకేషన్లు ఉచితంగా ఇవ్వాలంటూ మా అసోసియేషన్‌ ప్రభుత్వాలకి లేఖ రాయాలని, అలాంటి ప్రోత్సాహకాలతోనే చిన్న సినిమాలు విరివిగా రూపుదిద్దుకుని, నటులకి ఉపాధి దొరుకుతుందన్నారు. పురస్కారం అందుకున్న పలువురు సినీ ప్రముఖులు ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు గారపాటి లోకేశ్వరి, నందమూరి మోహనకృష్ణ, చైతన్యకృష్ణ, గారపాటి శ్రీనివాస్‌, నందమూరి యశ్వంత్‌తోపాటు రిటైర్డ్‌ ఐ.జి.మాగంటి కాంతారావు, అంబిక కృష్ణ, తుమ్మల ప్రసన్నకుమార్‌, అనంతపురం జగన్‌, విష్ణు బొప్పన తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని