Mari selvaraj: ధ్రువ్‌ విక్రమ్‌.. కబడ్డీ ఆటగాడిగా

విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్‌ తాజాగా స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ధ్రువ్‌ విక్రమ్‌ కథానాయకుడు. దిగ్గజ కబడ్డీ ఆటగాడు మనతి గణేశన్‌ జీవితం ఆధారంగా ఇది రూపొందుతోంది.

Updated : 06 May 2024 09:58 IST

విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్‌ తాజాగా స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ధ్రువ్‌ విక్రమ్‌ కథానాయకుడు. దిగ్గజ కబడ్డీ ఆటగాడు మనతి గణేశన్‌ జీవితం ఆధారంగా ఇది రూపొందుతోంది. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. తాజాగా ఈ చిత్రంలోని ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. అందులో ధ్రువ్‌ కబడ్డీ ఆటగాడి జెర్సీ, నిక్కరు వేసుకొని ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు వెల్లడించనున్నట్టు అందులో పేర్కొన్నారు. ప్రముఖ దర్శకుడు పా రంజిత్‌ సమర్పణలో అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.


టర్బో మాస్‌ లుక్‌

టీవలే ‘భ్రమయుగం’ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించారు మలయాళ స్టార్‌ మమ్ముట్టి. ఇప్పుడాయన ‘టర్బో’గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది తను హీరోగా నటిస్తూ.. స్వయంగా నిర్మించిన చిత్రం.  వైశాఖ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈనెల 23న థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు ఆదివారం ఈ చిత్రం నుంచి ఓ కొత్త లుక్‌ విడుదల చేశారు. ఇదొక భిన్నమైన యాక్షన్‌ కామెడీ చిత్రం. ఇందులో మమ్ముట్టి మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. సంగీతం: క్రిస్టో జేవియర్‌, ఛాయాగ్రహణం: విష్ణు శర్మ.


‘లవ్‌టుడే’ హీరో కొత్త చిత్రం

వ్‌ టుడే’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రదీప్‌ రంగనాథన్‌.. అదే చిత్ర నిర్మాతలతో మరోసారి చేతులు కలిపారు. వారి కలయికలో ‘డ్రాగన్‌’ అనే కొత్త సినిమాని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. అశ్వత్‌ మారిముత్తు దీనికి దర్శకత్వం వహిస్తారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. ఎక్స్‌ వేదికగా ఓ వీడియోను పంచుకుంది నిర్మాణ సంస్థ. చిత్రీకరణ సైతం  ప్రారంభించినట్లు అందులో తెలిపింది. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలోని ఇతర నటీనటులకు సంబంధించిన వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు. ప్రదీప్‌ ప్రస్తుతం ‘ఎల్‌ఐసీ’ చిత్రీకరణలో ఉన్నారు.


చందు ఛాంపియన్‌ సన్నాహాలు

చందు ఛాంపియన్‌’తో తన ప్రతిభ ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్‌ కథానాయకుడు కార్తిక్‌ ఆర్యన్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని కబీర్‌ ఖాన్‌ తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర పనులు ప్రస్తుతం ముగింపు దశలో ఉన్నాయి. తాజాగా ఇందులో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ పనులు పూర్తి చేసుకున్నాడు కార్తిక్‌. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా తెలుపుతూ.. ఓ ఫొటోను పంచుకున్నాడు. ‘కొంచెం వేచి ఉండండి. చందు మీ ముందుకు రాబోతున్నాడు. ట్రైలర్‌ త్వరలో విడుదల కానుంద’’నే వ్యాఖ్యల్ని జోడించాడు. భారత్‌ మొదటి పారాలింపిక్‌ బంగారు పతక విజేత మురళీకాంత్‌ పేట్కర్‌ జీవితం ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్‌ 14న విడుదల కానుంది.


అగ్ని వీరుడిగా ప్రతీక్‌

డ్‌గావ్‌ ఎక్స్‌ప్రెస్‌’తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ప్రతీక్‌ గాంధీ.. మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారు. ఆయన ‘అగ్ని’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. ఇన్‌స్టా వేదికగా ఫస్ట్‌లుక్‌ను పంచుకున్నారు. ‘‘మన ప్రాణాలను కాపాడటానికి వారి జీవితాల్ని పణంగా పెడుతున్న హీరోలు. వారి ధైర్యానికి నివాళి అర్పించడానికి ‘అగ్ని’ త్వరలో మీ ముందుకు రాబోతుంద’’ని వ్యాఖ్యల్ని జోడించారు. దీనికి రాహుల్‌ ధోలాకియా దర్శకత్వం వహిస్తున్నారు. దివ్వేందు శర్మ, సయామీ ఖేర్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సాహసాలు, త్యాగాలు ఇందులో సందేశాత్మకంగా చూపించనున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఫర్హాన్‌ అక్తర్‌, రితేష్‌ సిధ్వానీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని