Ala Vaikunthapurramuloo: ‘అల వైకుంఠపురములో’ విడుదలైతే ఈ మూవీ నుంచి తప్పుకొంటా!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘అల వైకుంఠపురములో’.

Published : 25 Jan 2022 15:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘అల వైకుంఠపురములో’. ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో కార్తీక్‌ ఆర్యను హీరోగా ‘షెహజాద్‌’ పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ విడుదలై బాలీవుడ్‌ ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది. దీంతో అల్లు అర్జున్‌కు వచ్చిన క్రేజ్‌ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని నిర్మాత మనీష్‌ షా భావించారు. ‘అల వైకుంఠపురములో’ డబ్బింగ్‌ హక్కులు తన వద్ద ఉండటంతో వెంటనే ఆ సినిమాను హిందీలోకి డబ్‌ చేశారు. అంతేకాదు, జనవరి 26న థియేటర్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇది విన్న ‘షెహజాద్‌’ చిత్ర బృందం ఒక్కసారిగా కంగుతింది. ఓ పక్క సినిమా రీమేక్‌ చేస్తుంటే, తెలుగు వెర్షన్‌ను డబ్బింగ్‌ చేసి ఎలా థియేటర్స్‌లో విడుదల చేస్తారని అసహనం వ్యక్తం చేసింది. రీమేక్‌లో హీరోగా నటిస్తున్న కార్తీక్‌ ఆర్యన్‌ అయితే, ‘షెహజాద్‌’ నుంచి తప్పుకొంటానని చెప్పేశాడట. మనీష్‌ షాతో చిత్ర బృందం సంప్రదింపులు జరిపి, సినిమా విడుదలను వాయిదా వేయించింది.

ఈ సందర్భంగా నిర్మాత మనీష్‌ షా మాట్లాడుతూ.. ‘‘అల వైకుంఠపురములో’ హిందీ వెర్షన్‌ థియేటర్స్‌లో విడుదల కావటం ‘షెహజాద్‌’ చిత్ర బృందానికి ఇష్టం లేదు. కథానాయకుడు కార్తీక్‌ ఆర్యన్‌ ఏకంగా సినిమా నుంచి తప్పుకొంటానని తేల్చి చెప్పేశాడు. అంతేకాదు, ఆ చిత్ర బృందం రూ.40కోట్లు నష్టపోతుంది. అది అనైతికమనిపించింది. ఆ సినిమా నిర్మాతలు నాకు గత పదేళ్లుగా తెలుసు. సినిమా విడుదలను విరమించుకుంటే నాకు రూ.20కోట్లు నష్టం. కేవలం డబ్బింగ్‌ కోసమే రూ.2కోట్లు ఖర్చు పెట్టాను. ఈ మూవీ ‘పుష్ప: ది రైజ్‌’ కన్నా మంచి హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకు ఉంది. ఇప్పుడు సినిమా విడుదల చేయకపోతే నేను కూడా నష్టపోతాను. అందుకే నా ఛానెల్‌లో నేరుగా విడుదల చేస్తా’’ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా అల్లు అరవింద్‌ కోసం సినిమా విడుదలను వాయిదా వేసుకున్నానని మనీష్‌ షా తెలిపారు. ‘షెహజాద్‌’ మూవీని భూషణ్‌కుమార్‌, అమన్‌ గిల్‌ నిర్మిస్తుండగా, అల్లు అరవింద్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రోహిత్‌ ధావన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కృతి సనన్‌ కథానాయిక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని