Kejriwal: నేనొక ప్రియమైన ఉగ్రవాదిని..!

వేర్పాటువాద వ్యాఖ్యలు చేశానంటూ తనపై వచ్చిన ఆరోపణలు ‘కామెడీ’ అంటూ ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కొట్టిపారేశారు.

Published : 19 Feb 2022 01:28 IST

తనపై వచ్చిన వేర్పాటువాద విమర్శలను ఖండించిన ఆప్‌ అధినేత

దిల్లీ: వేర్పాటువాద వ్యాఖ్యలు చేశానంటూ తనపై వచ్చిన ఆరోపణలు ‘కామెడీ’ అంటూ ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కొట్టిపారేశారు. తానొక ప్రియమైన ఉగ్రవాదినని అభివర్ణించుకున్నారు. కేజ్రీవాల్ ఒక స్వతంత్ర దేశానికి ప్రధాని కావాలనుకుంటున్నారని, ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనుకుంటున్నారని ఇటీవల ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వ్యాఖ్యలు చేసింది ఆప్‌ వ్యవస్థాపక సభ్యుడు కుమార్ విశ్వాస్‌. అయితే ఆయన ఇప్పుడు ఆప్‌ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. విశ్వాస్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. భాజపా, కాంగ్రెస్ కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశాయి.

‘వారంతా నాకు వ్యతిరేకంగా జట్టుకట్టారు. వారు నన్ను ఉగ్రవాది అని పిలుస్తున్నారు. ఇదంతా వింటుంటే నాకు నవ్వొస్తోంది. అదే నిజమైతే, నాపై చర్యలు ఎందుకు తీసుకోరు? నేను ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రియమైన ఉగ్రవాదిని. పాఠశాలలు, ఆసుపత్రులు, విద్యుత్‌, రహదారులు, నీరు అందించే ఉగ్రవాదిని’ అని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఆ ఆరోపణలను ఖండించారు. 

‘నేను దేశ విభజనకు కుట్రపన్నుతున్నానని, దేశంలోని ఒక భాగానికి ప్రధాని అవ్వాలనుకుంటున్నానని వారు అంటున్నారు. ఈ లెక్కన నేను పెద్ద ఉగ్రవాదినే. అప్పుడు వారి భద్రతా సంస్థలు ఏం చేస్తున్నాయి? దేశంలోని పెద్ద పార్టీలు దేశ భద్రతను అపహాస్యం చేస్తున్నాయి. ఉగ్రవాదులు రెండు రకాలుగా ఉంటారు. ఒకరు.. ప్రజల్లో భయం కలిగిస్తారు. మరొకరు.. అవినీతిపరుల్లో భయం పుట్టిస్తారు. ఇప్పుడు ఈ అవినీతిపరులంతా నాకు వ్యతిరేకంగా జట్టు కట్టారు. వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. 100 సంవత్సరాల క్రితం విప్లవ యోధుడు భగత్‌ సింగ్‌ను ఉగ్రవాది అన్నారు. ఇప్పుడు ఆయన అనుచరులను ఆ మాట అంటున్నారు’ అని భాజపా, కాంగ్రెస్ పార్టీలను దుయ్యబట్టారు.

ఇదిలా ఉండగా.. మొదట ఎన్నికల సంఘం కుమార్ విశ్వాస్ వీడియోను నిషేధించింది. తర్వాత ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం గమనార్హం. ఇక రెండురోజుల్లో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని