Chandrababu: రావణాసురుడిని అంతం చేసేందుకే భాజపాతో కలిశా: చంద్రబాబు

కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమేనని, అందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా, జనసేన, భాజపా కలిసింది రాష్ట్రం కోసమేనని చెప్పారు.

Updated : 06 Apr 2024 22:36 IST

క్రోసూరు: కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమేనని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం అవసరమన్న సదుద్దేశంతో భాజపాతో పొత్తు పెట్టుకున్నామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా, జనసేన, భాజపా కలిసింది రాష్ట్రం కోసమేనని చెప్పారు. పల్నాడు జిల్లా క్రోసూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రావణాసురుడిని చంపేందుకు వానర సైన్యమంతా కలిసిందన్నారు.

‘‘రాముడు దేవుడైనప్పటికీ.. వానరులతో కలిసి పోరాడారు. రాష్ట్రంలో రావణాసురుడిని అంతం చేసేందుకే భాజపాతో కలిశాం. ఈ దోపిడీ దొంగలు కృష్ణా నది మీదనే రోడ్డు వేశారు. ఇసుకాసురుడిని అంతం చేసి పేదలకు ఉచితంగా ఇసుక ఇస్తాం. ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో అనేక  అరాచకాలు జరిగాయి. ముస్లింలపై అనేక దాడులు జరిగాయి. ముస్లిం మహిళలు, బాలికలను వైకాపా నేతలు వేధించారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు అలాగే ఉంటాయని హామీ ఇస్తున్నా. 2014లోనూ భాజపాతో తెదేపా కలిసే ఉంది. 2014-2019 మధ్య ముస్లింలకు ఏమైనా అన్యాయం జరిగిందా? రాష్ట్రంలో ముస్లింల రక్షణకు నేను హామీ ఇస్తున్నా. జాబు కావాలంటే చంద్రబాబు మళ్లీ రావాలి. గంజాయి కావాలంటే జగన్‌ ఉండాలి. ఏపీ నుంచి ఎంతోమంది అమెరికాకు వెళ్లారు. తెలుగువాళ్లు అమెరికా వెళ్లేలా ఫౌండేషన్‌ వేసింది ఎవరు? పోలవరం ప్రాజెక్టును నేనే 72 శాతం పూర్తి చేశాను. ఈ ఐదేళ్లలో పోలవరం మిగతా పనులు ఏమాత్రం చేయలేదు. యువత కంటే నా ఆలోచనలు 20 ఏళ్లు ముందుంటాయి. ఆనాడు నేను చేసిన కృషితో ఇవాళ హైదరాబాద్‌ నంబర్‌ వన్‌గా ఉంది. తెదేపా అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా. తెదేపా గెలిస్తే.. పెదకూరపాడులో ఐటీపార్కు ఏర్పాటుచేస్తా’’ అని చంద్రబాబు అన్నారు.

సూపర్‌ సిక్స్‌తో జీవితాల్లో మార్పు

రాష్ట్రం బాగుపడాలంటే ఎన్డీయేను గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘‘ సంపద సృష్టించి అందరికీ పంచే పార్టీ తెదేపా. కొరియా నుంచి ఏపీకి కియా సంస్థ తీసుకొచ్చా. అమరరాజా కంపెనీని వేధిస్తే అది తెలంగాణకు వెళ్లిపోయింది. తెదేపా అమలుచేసే సూపర్‌ సిక్స్‌తో మీ జీవితాలు మారతాయి. తల్లికి వందనం కింద మహిళలకు ఏడాదికి రూ.15వేలు ఇస్తాం. కుటుంబంలో ఎంతమంది ఉన్నా.. అందరికీ ఈ పథకం వర్తింపజేస్తాం. పేదలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణసౌకర్యం కల్పిస్తాం. ప్రతీ ఇంటికీ నల్లా ద్వారా మంచినీరు సరఫరా చేస్తాం. జగన్‌ రూ.10 ఇచ్చి రూ.100 తీసుకుంటున్నారు. పింఛన్ల పంపిణీలో జగన్‌ శవరాజకీయాలు చేస్తున్నారు. ఇంతమంది సచివాలయ ఉద్యోగులు పింఛన్లు ఇవ్వలేరా?ఎన్డీయే గెలిస్తే.. రూ.4వేల పింఛన్‌ ఇస్తాం’’ అని చంద్రబాబు అన్నారు.

తల్లి కాంగ్రెస్‌.. పిల్ల కాంగ్రెస్‌.. ఓ నాటకం

‘‘ తల్లి కాంగ్రెస్‌, పిల్ల కాంగ్రెస్‌ కలిసి కొత్త నాటకం ఆడుతున్నాయి. కుమారుడికి ఏపీ, కుమార్తెకు తెలంగాణ రాసిచ్చానని ఒక తల్లి చెప్పారు. ఆ తల్లి తన ఇద్దరు పిల్లలకే న్యాయం చేయలేదు. రాష్ట్రానికి ఏం చేస్తారు. పిల్ల కాంగ్రెస్‌ వ్యతిరేక ఓట్లు చీల్చాలని తల్లి కాంగ్రెస్‌ నాటకం ఆడుతోంది. ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఇంట్లో తేల్చుకోవాలి. ఎన్డీయేకు పడే ఓట్లు చీల్చాలని వాళ్లు నాటకం ఆడుతున్నారు’’ అని చంద్రబాబు అన్నారు. 

ఐదేళ్లలో రూ.8 లక్షల కోట్ల అప్పు

అనంతరం సత్తెనపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. ‘‘ ఇక్కడికి వస్తే నా సోదరుడు కోడెల శివస్రసాద్‌ గుర్తుకు వస్తారు.  ఒక సైకో.. పల్నాడు పులి కోడెలను వేధించాడు. ఆత్మహత్య చేసుకునేలా చేశాడు. ఆయన కుమారుడు కోడెల శివరాం భవిష్యత్‌, బాధ్యత నేను తీసుకుంటా. జగన్‌ ఈ ఐదేళ్లలో రూ.8 లక్షల కోట్లు అప్పు చేశారు. ఎన్డీయే ఉన్నందున కేంద్రం సహకారంతో అభివృద్ధి చేసుకుందాం. నన్ను, పవన్‌ను తిట్టేందుకే అంబటికి మంత్రి పదవి ఇచ్చారు. రాజధానిగా అమరావతి ఉంటేనే.. సత్తెనపల్లి అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్‌. రాజధాని వస్తే రాష్ట్రానికి ఆదాయం, సంపద వస్తుంది’’ అని చంద్రబాబు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని