Presidential Election: ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది

ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ఎస్టీ మహిళ ద్రౌపదీ ముర్మూ ఎంపికయ్యారు. మంగళవారం రాత్రి భాజపా ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు 20 పేర్లను వడపోసిన అనంతరం దేశంలోని తూర్పు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని

Updated : 22 Jun 2022 06:51 IST

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయనున్న ఒడిశా టీచరమ్మ

ఒడిశా రాష్ట్ర మంత్రిగా, ఝార్ఖండ్‌ గవర్నర్‌గా పనిచేసిన అనుభవం

తొలిసారి ఎస్టీలకు అవకాశం ఇస్తున్న ఎన్డీయే

ఈనాడు-దిల్లీ, భువనేశ్వర్‌-న్యూస్‌టుడే

ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ఎస్టీ మహిళ ద్రౌపదీ ముర్మూ ఎంపికయ్యారు. మంగళవారం రాత్రి భాజపా ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు 20 పేర్లను వడపోసిన అనంతరం దేశంలోని తూర్పు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అందులోనూ ఇప్పటివరకూ రాష్ట్రపతి పదవి చేపట్టని ఎస్టీలకు ఎన్డీయే ద్వారా ఆ గౌరవం కల్పించాలన్న ఉద్దేశంతో ఆమెను ఎంపిక చేసినట్లు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. రాత్రి 7.30 గంటల నుంచి 9.15 వరకు జరిగిన పార్లమెంటరీ బోర్డు భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ తదితరులు విభిన్న అంశాలు, అభ్యర్థుల పేర్లపై చర్చించి చివరకు ఆమెను ఖరారు చేశారు. ఝార్ఖండ్‌ గవర్నర్‌గా పనిచేసిన ఈమె పేరు 2017లోనూ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చింది.  2007 నుంచి 2012 వరకు భారత రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్‌ ఉన్నారు. అధికార పార్టీ తరఫున రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న రెండో మహిళ ముర్మూ అవుతారు. 1958 జూన్‌ 20న ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా బైడాపోసి గ్రామంలో జన్మించిన ఈమె రాష్ట్రపతిగా బాధ్యతలు చేపడితే స్వతంత్ర భారతదేశంలో పుట్టి, రాష్ట్రపతి స్థానానికి చేరిన తొలివ్యక్తిగానూ రికార్డు సాధిస్తారు. ఇప్పటివరకు రాష్ట్రపతులుగా ఉన్నవారంతా 1947కి ముందు పుట్టినవారే. సంతాల్‌ గిరిజన తెగకు చెందిన ముర్మూ ఒడిశాలో భాజపా, బిజద సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. భాజపా నాయకత్వం పూర్తిగా సామాజిక కోణంలోనే ఆమె ఎంపికకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. అణగారిన వర్గాలకు, అదీ కాకుండా మహిళకు అవకాశం కల్పిస్తే సముచితంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈమె అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపినట్లు పార్టీ వర్గాల విశ్లేషణ.

ఆమె ఎంపిక ఎందుకంటే..

ఇప్పటివరకు రాష్ట్రపతి పదవిని అగ్రవర్ణాలు, ముస్లిం మైనార్టీలు, దళిత సామాజిక వర్గానికి చెందినవారు చేపట్టినా ఎస్టీలు మాత్రం రైసినా హిల్‌ మెట్లు ఎక్కలేదు. దేశ అత్యున్నత పదవిని అప్పగించిన గౌరవాన్ని భాజపా ఖాతాలో వేసుకోవడానికే ద్రౌపదీ ముర్మూని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ ఏడాది చివరిలో గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, వచ్చే ఏడాది జరిగే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, తెలంగాణ, కర్ణాటక, త్రిపుర ఎన్నికల్లో గిరిజన ప్రాబల్యం అధికంగా ఉన్న నేపథ్యంలోనే ఆ సామాజిక వర్గానికి బలమైన సంకేతం ఇవ్వడానికి ఈమెను తీసుకొచ్చారన్న భావన వినిపిస్తోంది. ఎలక్టొరల్‌ కాలేజిలో ఎన్డీయేకి 58% ఓట్లు ఉన్నందువల్ల ముర్మూ గెలుపు నల్లేరుపై నడకేనని అధికార పక్షం   భావిస్తోంది. ముర్మూ సోమవారమే 64వ పుట్టినరోజు చేసుకున్నారు. నెగ్గితే రాష్ట్రపతులందరిలో పిన్న వయస్కురాలు ఆమే అవుతారు. ఆమె పేరును ప్రకటించే ముందు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తోనూ భాజపా సంప్రదించింది. దరిమిలా ఆమెకు బిజద మద్దతు ప్రకటించింది.

వెంకయ్యనాయుడి పేరుపై విస్తృత ప్రచారం

మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడిని ఆగమేఘాల మీద దిల్లీకి రప్పించారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాలు ఆయన్ని కలవడంతో రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి అభ్యర్థిత్వంపై ఒక దశలో విస్తృత ప్రచారం జరిగింది. ఆ విషయాన్ని ఆయన కార్యాలయ వర్గాలేవీ ధ్రువీకరించలేదు. ఆయనతో వారు ఏం మాట్లాడారన్నదీ బయటికి రాలేదు. అధికార కూటమికి చెందిన ఉపరాష్ట్రపతి ఉంటే తదుపరి రాష్ట్రపతి ఎన్నికల్లో వారికే పదోన్నతి కల్పించడం ఇదివరకు ఆనవాయితీగా కొనసాగింది. 2007లో భాజపా కూటమికి మెజార్టీ లేకపోయినా అప్పట్లో ఉపరాష్ట్రపతిగా ఉన్న భైరాన్‌సింగ్‌ షెకావత్‌ను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి నిలబెట్టారు. భాజపా ఈసారి అలాంటి సంప్రదాయాన్ని పక్కన పెట్టి కొత్త అభ్యర్థిని తెరమీదికి తెచ్చింది.

కొత్త తరం నేతలకు ప్రోత్సాహం

మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత తరం నాయకులను కాకుండా కొత్తతరం వారిని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కేంద్ర మంత్రివర్గంలోనూ, గవర్నర్ల నియామకంలోనూ ఇదే పంథా కొనసాగుతూ వస్తోంది. వాజ్‌పేయీ హయాంలో పనిచేసిన వారిలో కేంద్ర మంత్రివర్గంలో రాజ్‌నాథ్‌సింగ్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ, నితిన్‌ గడ్కరీ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు కొత్త కొలమానాలు, సరికొత్త సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ద్రౌపదీ ముర్మూను అదృష్టం వరించింది. ఇదివరకు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ఉత్తర, దక్షిణ భారతదేశాలన్న కొలమానాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు భాజపా నాయకత్వం కొత్తగా తూర్పు భారతాన్ని తెరమీదికి తెచ్చింది. రాష్ట్రపతులుగా చేసిన వారిలో ప్రణబ్‌ముఖర్జీ తూర్పు భారతానికి చెందిన పశ్చిమ బెంగాల్‌వారే. అయినప్పటికీ మంగళవారం ద్రౌపదీ ముర్మూ పేరు ప్రకటించేటప్పుడు జేపీ నడ్డా.. తూర్పు భారతానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆమె పేరును ఎంపిక చేసినట్లు ప్రకటించారు.

భాగస్వామ్య పక్షాలతో మాట్లాడాకే ప్రకటన

‘‘20 పేర్లపై విస్తృత చర్చ జరిగింది. కానీ రాష్ట్రపతి అభ్యర్థి కోసం తూర్పు ప్రాంతం వారిని ఎంపిక చేయాలనీ, వీలైతే మహిళకు, ఇప్పటివరకూ రాష్ట్రపతి ఎన్నికల్లో ఆదివాసీలకు అవకాశం దక్కనందున ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాం. ఆ కోణాల్లో ద్రౌపదీ ముర్మూ పేరును ఖరారు చేశాం. ఉపాధ్యాయురాలిగా జీవితం ప్రారంభించి కౌన్సిలర్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే, మంత్రి, గవర్నర్‌గా ఆమె పనిచేశారు. 2007లో ఉత్తమ ఎమ్మెల్యేగా నీల్‌కంఠ్‌ అవార్డు అందుకున్నారు. విద్యను నమ్ముకొని జీవితంలో పైకెదిగారు. అప్పగించిన బాధ్యతలన్నింటినీ ఉత్తమంగా నిర్వర్తించారు. అందుకే ఎన్డీయే భాగస్వాములన్నింటితో మాట్లాడిన తర్వాత ఆమె పేరు ప్రకటిస్తున్నాం’’ అని నడ్డా వెల్లడించారు. ముర్మూ బాల్యం నుంచి సంఘ్‌ పరివార్‌తో సన్నిహితంగా ఉన్నారు. విద్యాభ్యాసం తర్వాత సేవారంగంలో ప్రవేశించి మయూర్‌భంజ్‌ ఆదివాసీల హితం కోసం ఉద్యమించారు. 2021 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె సేవా కార్యక్రమాలకే పరిమితం అయ్యారు.


గొప్ప రాష్ట్రపతి అవుతారు

ద్రౌపదీ ముర్మూ తన జీవితాన్ని సమాజ సేవ, పేదల సాధికారత, అట్టడుగు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంకితం చేశారు. పాలనలో ఆమెకు మంచి అనుభవం ఉంది. ఆమె ఈ దేశానికి గొప్ప రాష్ట్రపతి కాగలరన్న నమ్మకం నాకుంది. పేదరికం, కష్టనష్టాలు ఎదుర్కొంటున్న కోట్లమంది ప్రజలు ద్రౌపదీ ముర్మూ జీవితం నుంచి గొప్ప స్ఫూర్తిని పొందుతారు. విధానాలపట్ల ఆమెకున్న అవగాహన దేశానికి గొప్ప మేలు చేస్తుంది.

- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ


ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యా..

నన్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలిసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాను. ఆదివాసీ మహిళనైన నన్ను సర్వోన్నత పదవికి అభ్యర్థినిగా ఎంపిక చేయడం భాజపా నాయకత్వానికే చెల్లింది. సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌ నినాదంతో ముందుకెళ్తున్న ప్రధానికి కృతజ్ఞతలు. అన్ని పార్టీల నేతలను కలసి మద్దతు కోరుతాను. గవర్నర్‌గా విధులు నిర్వహించిన నాకు రాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవి నిర్వహించడం ఇబ్బంది కాదు.

-ద్రౌపదీ ముర్మూ


ద్రౌపదీ ముర్మూ ఎవరంటే..

పూర్తి పేరు : ద్రౌపది ముర్మూ

పుట్టిన తేదీ : 1958 జూన్‌ 20

పుట్టిన ప్రదేశం : బైదపొసి, మయూర్‌భంజ్‌ జిల్లా, ఒడిశా రాష్ట్రం

తండ్రి : బిరించి నారాయణ్‌ తుడు

భర్త : శ్యామ్‌చరణ్‌ ముర్మూ (మృతిచెందారు)

సంతానం : ఇద్దరు కుమారులు (మృతిచెందారు), ఒక కుమార్తె ఇతిశ్రీ ముర్మూ

విద్యార్హత : బీఏ (రమాదేవి మహిళా కళాశాల, భువనేశ్వర్‌)

వృత్తి జీవితం : నీటి పారుదల శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ (1979-1983). గౌరవ అసిస్టెంట్‌ టీచర్‌, శ్రీఅరబిందో ఇంటెగ్రల్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌, రాయ్‌రంగ్‌పూర్‌ (1994-1997)


రాజకీయ ప్రస్థానం..

* 1997: భాజపాలో చేరిక.. రాయ్‌రంగ్‌పుర్‌ కౌన్సిలర్‌, వైస్‌ ఛైర్మన్‌గా ఎన్నిక

* 2000: రాయ్‌రంగ్‌పుర్‌ ఎమ్మెల్యేగా ఎన్నిక

* 2000-2002: ఒడిశా రవాణా, వాణిజ్య శాఖ మంత్రి (బిజద-భాజపా సంకీర్ణ ప్రభుత్వం)

* 2002-2004: ఒడిశా పశు సంవర్ధక శాఖ మంత్రి

* 2004: రాయ్‌రంగ్‌పుర్‌ ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నిక

* 2002-2009: మయూర్‌భంజ్‌ జిల్లా భాజపా అధ్యక్షురాలు

* 2006-2009: ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలు

* 2010: మయూర్‌భంజ్‌ జిల్లా భాజపా అధ్యక్షురాలు

* 2013-2015: మయూర్‌భంజ్‌ జిల్లా భాజపా అధ్యక్షురాలు

* 2015: ఝార్ఖండ్‌ గవర్నర్‌గా నియామకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని