Seized Ship: ఇరాన్‌ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి

Seized Ship: ఇరాన్‌ అదుపులో ఉన్న నౌకలోని భారతీయ సిబ్బందిలో ఐదుగురికి విముక్తి లభించింది. దౌత్య చర్చలు ఫలించడంతో వారిని స్వదేశానికి పంపించారు.

Updated : 10 May 2024 10:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల వేళ భారత్‌కు వచ్చే ఓ నౌక (Seized Ship)ను గత నెల ఇరాన్‌ (Iran) స్వాధీనం చేసుకోవడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. పర్షియన్‌ గల్ఫ్‌లో నియంత్రణలోకి తీసుకున్న ఈ నౌకలో పలువురు భారతీయ నావికులు (Indian sailors) కూడా ఉన్నారు. దాదాపు నెల రోజుల తర్వాత వీరిలో కొందరికి ట్రెహాన్‌ తాజాగా విముక్తి కల్పించింది. ఈ మేరకు ఇరాన్‌లోని భారత ఎంబసీ వెల్లడించింది.

‘‘ఎంఎస్‌సీ ఏరిస్‌లోని భారత సిబ్బంది (Indian Crew)లో ఐదుగుర్ని విడుదల చేశారు. గురువారం సాయంత్రం వారు స్వదేశానికి బయల్దేరారు. నావికుల విడుదల కోసం భారత ఎంబసీ, కాన్సులేట్‌ చేసే ప్రయత్నాలకు ఇరాన్‌ అధికారుల నుంచి సహకారం లభిస్తోంది’’ అని దౌత్యకార్యాలయం (Indian Embassy) పేర్కొంది. భారతీయులతో పాటు ఫిలిప్పీన్స్‌, ఎస్టోనియాకు చెందిన మరో ఇద్దరు సిబ్బందిని కూడా టెహ్రాన్‌ నిన్న విడుదల చేసినట్లు తెలుస్తోంది.

కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్‌ హత్య కేసుపై భారత్‌

ఏప్రిల్‌ 13న హర్మూజ్‌ జలసంధి సమీపంలో ఇజ్రాయెల్‌ (Israel) కుబేరుడికి చెందిన వాణిజ్య నౌక ఎంఎస్‌సీ ఏరిస్‌ను ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ దళం హెలికాప్టర్లతో వెంబడించి అధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా.. అందులో 17 మంది భారతీయులు. దీంతో వీరి విడుదల కోసం భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఆ మధ్య ఇరాన్‌ విదేశాంగశాఖ మంత్రి హుసేన్‌ అమీర్‌ అబ్దుల్లాహియాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆయన అభ్యర్థన మేరకు మన సిబ్బందిని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు కలిసేందుకు అనుమతించారు.

అనంతరం జరిపిన చర్చలతో భారతీయ సిబ్బందిలో ఒకరైన కేరళ మహిళ అంటెస్సా జోసెఫ్‌ను ఇరాన్‌ విడుదల చేసింది. ఏప్రిల్‌ 18న ఆమె క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. తాజాగా మరో ఐదుగురికి విముక్తి లభించింది. మిగిలిన 11 మంది భారత నావికులు ఇంకా టెహ్రాన్‌ అదుపులోనే ఉన్నారు. అయితే, ఈ సంఖ్యను విదేశాంగ శాఖ ధ్రువీకరించలేదు. మరోవైపు, నౌకలోని పాక్‌ జాతీయులను ఇరాన్‌ గత నెలల్లోనే విడుదల చేసినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు