జనాభాలో హిందువుల వాటా తగ్గుదల

భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) తెలిపింది.

Updated : 10 May 2024 06:12 IST

2015 నాటికి 78.06%కు పరిమితం
1950తో పోలిస్తే వారి వర్గంలో 7.82% క్షీణత
అదే సమయంలో ముస్లింల వాటాలో 43.15% పెరుగుదల
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నివేదికలో వెల్లడి

దిల్లీ: భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) తెలిపింది. 1950లో మన దేశంలో 84.68%గా ఉన్న ఈ మెజార్టీ వర్గం వాటా.. 2015 నాటికి 78.06%కు క్షీణించిందని వెల్లడించింది. అంటే హిందువుల వాటాలో 7.82% తగ్గుదల నమోదైందని పేర్కొంది. అదే సమయంలో ముస్లింల వాటా 9.84% నుంచి 14.09%కు పెరిగినట్లు తెలియజేసింది. వారి వాటాలో పెరుగుదల 43.15%గా నమోదైనట్లు వివరించింది. 1950-2015 మధ్య క్రైస్తవులు, సిక్కుల వాటా స్వల్పంగా పెరిగిందని.. జైనులు, పార్శీల శాతం తగ్గిందని వెల్లడించింది. సమాజంలో భిన్నత్వాన్ని పెంపొందించేందుకు వీలుగా ఉన్న అనుకూల వాతావరణాన్ని ఈ మార్పులు సూచిస్తున్నాయని సలహా మండలి అభిప్రాయపడింది. విధానపరమైన చర్యలు, రాజకీయ నిర్ణయాలు, సామాజిక ప్రక్రియల ఫలితంగా ఈ మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపింది. శామికా రవి నేతృత్వంలోని ఈఏసీ-పీఎం ప్రపంచవ్యాప్తంగా 167 దేశాల్లో పరిస్థితులను అధ్యయనం చేసి ఈ మేరకు నివేదికను రూపొందించింది. ఆయా వర్గాల జనాభా నిర్దిష్టంగా ఎంత ఉందన్నది మాత్రం అందులో తెలియజేయలేదు.

పొరుగున మెజార్టీ మతస్థుల పెరుగుదల

తాజా నివేదిక ప్రకారం- దక్షిణాసియాలోని బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, భూటాన్‌, అఫ్గానిస్థాన్‌ వంటి భారత పొరుగు దేశాల్లో మాత్రం మెజార్టీ మతస్థుల వాటా పెరుగుతోంది. వాటిలో మైనార్టీల వాటా ఆందోళనకర రీతిలో తగ్గుతోంది. 1950-2015 మధ్య మాల్దీవులు మినహా అన్ని ముస్లిం మెజార్టీ దేశాల్లోనూ మెజార్టీ వర్గం ప్రజల వాటా పెరిగింది. మాల్దీవుల్లో మెజార్టీ వర్గంగా ఉన్న షఫీ సున్నీల వాటా 1.47% తగ్గింది. బంగ్లాదేశ్‌లో మెజార్టీ మతస్థుల వాటా 18% అధికంగా నమోదైంది. భారత ఉపఖండంలో ఇదే అత్యధిక పెరుగుదల. పాకిస్థాన్‌లో మెజార్టీ వర్గమైన హనాఫీ ముస్లింల వాటా 3.75% పెరిగింది. మొత్తంగా ఆ దేశ జనాభాలో ముస్లింల వాటా పరంగా 10% పెరుగుదల నమోదైంది. ముస్లిమేతరులు మెజార్టీ వర్గాలుగా ఉన్న దేశాల్లో.. మయన్మార్‌, భారత్‌, నేపాల్‌లలో మెజార్టీ మతస్థుల వాటా తగ్గింది. 35 అధికాదాయ ఓఈసీడీ దేశాల్లో మెజార్టీ మతస్థుల వాటా సగటున 29% క్షీణించింది. ప్రపంచ సగటు (22%) తో పోలిస్తే ఇది ఎక్కువ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని