తెలంగాణ బడ్జెట్‌పై ఎవరేమన్నారంటే?

భారాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్‌ ఓ జిమ్మిక్కని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.

Published : 07 Feb 2023 03:56 IST

అన్నీ అవాస్తవ లెక్కలే: కిషన్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: భారాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్‌ ఓ జిమ్మిక్కని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. బడ్జెట్‌లో అన్నీ అబద్ధాలు, అవాస్తవ లెక్కలు, అమలుగాని వాగ్దానాలున్నాయంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ బడ్జెట్‌పై సోమవారం తొలుత ట్వీట్‌లు చేసిన కేంద్రమంత్రి అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రకటనలు, ప్రచారం కోసం ఫాంహౌస్‌ సర్కార్‌ బడ్జెట్‌లో 575 శాతం పెంపుతో రూ.1000 కోట్లను కేటాయించిందని, అదే సందర్భంలో ‘ఆరోగ్యశ్రీ’కి తక్కువ నిధులు ఇవ్వడం దారుణమని అన్నారు. కేంద్రాన్ని నిందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, కేంద్రాన్ని, మోదీని విమర్శించకుంటే కల్వకుంట్ల కుటుంబానికి పూట గడవడం లేదని కేంద్రమంత్రి మండిపడ్డారు.  తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్‌ ఏనుగు తొండం చూపించి ఎలుక తోకలా నిధులు కేటాయించినట్లు ఉందని భాజపా రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. దిల్లీ తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.   


డొల్ల బడ్జెట్‌ను ప్రజల్లో ఎండగడతాం: బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఎన్నికల స్టంట్‌ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ సహా అన్ని వర్గాలను మోసం చేసేలా ఉందని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.డొల్ల బడ్జెట్‌ను ప్రజల్లో ఎండగడతామన్నారు. ఉద్యోగులకు ప్రతినెలా ఏరోజున జీతాలిస్తారో చెప్పలేని ప్రభుత్వం అంకెల గారడీ చేస్తోందన్నారు. రూ.లక్షలోపు రైతులకు రుణమాఫీకి రూ.19,700 కోట్లు కావాల్సి ఉండగా రూ.6,285 కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. ‘దళితబంధు’కు గతేడాది రూ.17,700 కోట్లు కేటాయించినా ఖర్చు చేయలేదన్నారు. 


రుణమాఫీ ప్రస్తావనే లేదు

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రజలను దగాచేసే బడ్జెట్‌ ప్రవేశపెట్టారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, రాజాసింగ్‌లతో కలిసి ఆయన సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. ‘రుణమాఫీ విషయం ప్రస్తావన లేకుండానే మంత్రి ప్రసంగం సాగింది. రుణమాఫీ కాకపోవడంతో రైతులకు బ్యాంకులు రుణాలివ్వడం లేదు. వేళకు వేతనాలు అందక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో వివిధ శాఖల పరిధిలోని కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వనరులన్నీ ఉన్న రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది?’ అని ప్రశ్నించారు.


కొత్తగా ఏం లేదు: సీఎల్పీ నేత భట్టి

ఈనాడు, హైదరాబాద్‌- గాంధీభవన్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర బడ్జెట్‌లో కొత్తగా ఏం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయడానికి, పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయించలేదన్నారు. బీసీలకు రూ.6229 కోట్లు మాత్రమే కేటాయించడం తగదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ ప్రసంగమంతా సీఎం కేసీఆర్‌ పొగడ్తలకే పరిమితమైందన్నారు. ప్రభుత్వ అంచనా రాబడులు ఎంత అనేది చెప్పకుండా బడ్జెట్‌ ప్రసంగం చదివిన మొదటి మంత్రి హరీశ్‌రావు అని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌ కేటాయింపులు వాస్తవ పరిస్థితులకు విరుద్దంగా ఉన్నాయని కాంగ్రెస్‌ నేతలు మహేశ్వర్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి విమర్శించారు.


బీసీలకు రెండు శాతం నిధులా?: కాసాని జ్ఞానేశ్వర్‌

‘అంకెల గారడీతో ప్రజలను మోసం చేసేలా రాష్ట్ర బడ్జెట్‌ ఉంది. 52 శాతం ఉన్న బీసీలకు బడ్జెట్‌లో 2 శాతం నిధులే కేటాయిస్తారా? నామమాత్ర నిధుల కేటాయింపులతో విద్య, వైద్య రంగాలను మరింత నిర్వీర్యం చేశారు’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్‌ అన్నారు.


విద్య, వైద్య రంగాలపై వివక్ష: తమ్మినేని వీరభద్రం

‘విద్య, వైద్య రంగాలకు నిధులు కేటాయించడంలో ప్రభుత్వం వివక్ష చూపింది. ఎనిమిదేళ్లుగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు పక్కదారి పడుతున్నాయి. నిరుద్యోగ భృతి, గిరిజన బంధును విస్మరించారు’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.


ఇంటి నిర్మాణానికి అరకొర కేటాయింపు: కూనంనేని సాంబశివరావు

‘సొంత స్థలం ఉన్న వారు ఇల్లు కట్టుకునేందుకు బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.3 లక్షలు సరిపోదు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలకు పెంచాలి. నిరుద్యోగులకు భృతి ఇవ్వాలి’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు.


ప్రాధాన్య రంగాలకు మొండిచేయి: కోదండరాం

‘నిధుల కేటాయింపులో ప్రాధాన్య రంగాలకు మొండిచేయి చూపారు. హైదరాబాద్‌ను పక్కన పెట్టి తలసరి ఆదాయం ఎక్కడ పెరిగిందో చూపాలి’ అని తెజస అధ్యక్షుడు కోదండరాం ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని