Siddaramaiah: కాకలుతీరిన యోధుడు సిద్ధరామయ్య

కర్ణాటక కాంగ్రెస్‌లో కాకలుతీరిన యోధుడిగా పేరుపొందిన సిద్ధరామయ్య (75) పుట్టింది మైసూరు జిల్లాలోని మారుమూల గ్రామమైన సిద్ధరామనహుండిలో.

Updated : 14 May 2023 09:41 IST

జనతా పరివార్‌ నుంచి సుదీర్ఘ ప్రస్థానం

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో కాకలుతీరిన యోధుడిగా పేరుపొందిన సిద్ధరామయ్య (75) పుట్టింది మైసూరు జిల్లాలోని మారుమూల గ్రామమైన సిద్ధరామనహుండిలో. ఆయన తండ్రి సిద్ధరామె గౌడ ఓ రైతు. ఐదుగురు తోబుట్టువుల్లో సిద్ధూ రెండోవారు. మైసూరు విశ్వవిద్యాలయంలో బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు. జూనియర్‌ న్యాయవాదిగా కొనసాగి, కొన్నాళ్లు న్యాయశాస్త్రాన్ని బోధించారు. సిద్ధూ-పార్వతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు రాకేశ్‌ తన తండ్రి అడుగుజాడల్లోనే రాజకీయాల్లోకి వచ్చినా అనారోగ్యం కారణంగా 38 ఏళ్ల వయసులో 2016లో కన్నుమూశారు. చిన్నబ్బాయి యతీంద్ర గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నెగ్గారు.

అలా మొదలైంది

సిద్ధూకు జనతా పరివార్‌తో ప్రగాఢ అనుబంధం ఉంది. భారతీయ లోక్‌దళ్‌ పార్టీ టికెట్‌పై చాముండేశ్వరి నియోజకవర్గంలో నెగ్గి 1983లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనూహ్య విజయంతో ఆయన పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఆ తర్వాత ఐదుసార్లు అక్కడి నుంచే గెలిచి, మరో మూడుసార్లు ఓడిపోయారు. తొలిసారి గెలిచిన తర్వాత ఆయన అధికార జనతాపార్టీలో చేరారు. రామకృష్ణ హెగ్డే సర్కారులో మంత్రి పదవి చేపట్టారు. 1992లో జనతాదళ్‌ ప్రధాన కార్యదర్శి అయ్యారు. దళ్‌లో చీలికల తర్వాత జేడీఎస్‌లో చేరారు. కర్ణాటకలో మంత్రిగా 13 సార్లు బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనత ఆయన సొంతం. రెండుసార్లు ఉప ముఖ్యమంత్రిగా చేశారు.

కాంగ్రెస్‌లో చేరింది 2006లో

2004లో కర్ణాటక ఓటర్లు అస్పష్టమైన తీర్పు ఇవ్వడంతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కలిసి సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్‌ నేత ధరంసింగ్‌ సీఎం కాగా, అప్పట్లో జేడీఎస్‌లో ఉన్న సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి అయ్యారు. తానే సీఎంను కావాల్సి ఉన్నా జేడీఎస్‌ అగ్రనేత దేవెగౌడ ఆ అవకాశాలకు గండి కొట్టారని ఆయనకు ఆగ్రహంగా ఉండేది. దానికితోడు దేవెగౌడ తన కుమారుడు హెడ్‌.డి.కుమారస్వామికి పార్టీలో ప్రాధాన్యం లభించేలా ప్రయత్నాలు చేస్తుండడంతో సిద్ధరామయ్య వెనుకబడినవర్గాల నేతగా గుర్తింపు పొందేందుకు ఆరాటపడ్డారు. కర్ణాటకలో సంఖ్యాబలంలో మూడో స్థానంలో నిలిచే కురుబ సామాజిక వర్గానికి చెందిన ఆయన ‘అహిందా’ (మైనారిటీలు, బీసీలు, దళితులు) కూటమిని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అటు కుమారస్వామి అంశం, ఇటు సామాజిక సమీకరణాల యత్నాల్లో సిద్ధూపై జేడీఎస్‌ వేటు వేసింది. దీంతో మనస్తాపానికి గురై, ఒకదశలో రాజకీయ సన్యాసం తీసుకుని మళ్లీ న్యాయవాదిగా కొనసాగాలనే ఆలోచన చేశారు. ధనబలాన్ని తట్టుకునే శక్తి తనకు లేదంటూ ప్రాంతీయ పార్టీ నెలకొల్పే ప్రతిపాదనను తోసిపుచ్చారు. తమ గూటికి రావాలంటూ భాజపా, కాంగ్రెస్‌లు ఆయన్ని ఆహ్వానించాయి. భాజపా సిద్ధాంతాలతో ఏకీభవించలేనంటూ అనుచరులతో కలిసి 2006లో కాంగ్రెస్‌ గూటికి చేరారు. అంతకు రెండేళ్ల ముందు అది ఎవరూ ఊహించలేనిది.

అప్పట్లో ఖర్గేను కాదని సీఎం పదవిలోకి

2013 నుంచి 2018 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధూ సేవలందించారు. నిజానికి 2013లో సీఎం పీఠం కోసం ప్రస్తుత ఏఐసీసీ అధ్యక్షుడు, అప్పటి కేంద్రమంత్రి ఎం.మల్లికార్జున ఖర్గే నుంచి ఆయనకు గట్టిపోటీ ఎదురైంది. అయినా నెగ్గుకురాగలిగారు. ప్రజాదరణ పొందిన పథకాలను విజయవంతంగా అమలుచేసినా 2018లో కాంగ్రెస్‌ ఓడిపోవడానికి కారణం.. లింగాయతలకు మతపరమైన మైనారిటీ హోదా కల్పించాలని సిద్ధూ సర్కారు తీసుకున్న నిర్ణయమేనని చెబుతారు. ‘లింగాయత మతం’ కోసం చురుగ్గా ఉద్యమించిన అనేకమంది నేతలు ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. సిద్ధరామయ్య కూడా తన నియోజకవర్గంలో విజయం సాధించలేకపోయారు. అయితే బాదామి నియోజకవర్గంలోనూ పోటీచేసి అక్కడ గెలవడంతో అసెంబ్లీకి రాగలిగారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2008లో తన నియోజకవర్గానికి పొరుగున ఉన్న వరుణ (మైసూరులో) ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌ కావడంతో కుమారుడు యతీంద్రకు దానిని కేటాయించి, తిరిగి చాముండేశ్వరి నియోజకవర్గానికి ఆయన మారారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో సీఎం అభ్యర్థిత్వం గురించి ఆయన బాహాటంగానే అనేకసార్లు చెబుతూ వచ్చారు. ఆ పదవిని తాను ఆశించడంలో తప్పేమీ లేదని నిర్మొహమాటంగా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని