Gujarat: గుజరాత్‌ ఎన్నికల్లో ‘సన్‌’రైజ్‌.. 20 చోట్ల వారసుల పోటీ..!

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు రాజకీయ నేతల వారసులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ 13 చోట్ల, భాజపా 7 చోట్ల సిట్టింగ్‌, మాజీ ఎమ్మెల్యేల కుమారులకు టికెట్లు ఇచ్చింది.

Published : 21 Nov 2022 15:18 IST

అహ్మదాబాద్‌: సాధారణ సమయాల్లో వారసత్వ రాజకీయాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించే రాజకీయ పార్టీలు.. ఎన్నికల సమయంలో మాత్రం ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉంటాయి. త్వరలో జరగబోయే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పలు స్థానాల్లో వారసులు బరిలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్‌ కలిసి కనీసం 20 మంది సిట్టింగ్‌, మాజీ ఎమ్మెల్యేల కుమారులకు టికెట్లు ఇచ్చింది.

గుజరాత్‌లో డిసెంబరు 1, 5వ తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 13 చోట్ల, భాజపా 7 చోట్ల సిట్టింగ్‌ లేదా మాజీ ఎమ్మెల్యేల కుమారులను నిలబెట్టింది. విజయావకాశాలు, ఆయా నియోజకవర్గాల్లో మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో రాజకీయ పార్టీలు ఇలా వారసులకు టికెట్లు ఇస్తుంటాయి.

* దశాబ్దాల పాటు కాంగ్రెస్‌కు పనిచేస్తూ 10 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదివాసీ నేత మోహన్‌సిన్హ్‌ రత్వా ఇటీవల హస్తం పార్టీతో బంధం తెంచుకుని భాజపాలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చోటా ఉదయ్‌పుర్‌ స్థానాన్ని భాజపా రత్వా కుమారుడు రాజేందర్‌సిన్హ్‌కు కేటాయించింది. ఇక, ఇదే స్థానంలో కాంగ్రెస్‌ సంగ్రామ్‌సిన్హ్‌ రత్వాను బరిలోకి దించింది. ఈయన.. రైల్వే శాఖ మాజీ మంత్రి నరన్‌ రత్వా కుమారుడు. రాజేందర్‌, సంగ్రామ్‌ ఇద్దరికీ రాజకీయ అరంగేట్రం ఇదే కావడం విశేషం.

* థస్రా శాసనసభ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న యోగేంద్ర పార్మర్‌.. మాజీ ఎమ్మెల్యే రామ్‌సిన్హ్‌ పార్మర్‌ కుమారుడు. రామ్‌సిన్హ్‌ గతంలో రెండుసార్లు కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరారు.

* గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సిన్హ్‌ వాఘేలా కుమారుడు మహేంద్రసింగ్‌ వాఘేలా గత నెల మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాజా ఎన్నికల్లో ఆయన బయద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన మహేంద్ర సింగ్‌ ఆ మధ్య భాజపాలో చేరారు. ఇటీవల కాషాయ పార్టీని వీడి మళ్లీ.. హస్తం పార్టీలో చేరారు.

* మరో మాజీ ముఖ్యమంత్రి అమర్‌సిన్హ్‌ చౌదరీ కుమారుడు తుషార్‌ చౌదరీ.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా బర్దౌలీ నుంచి బరిలోకి దిగారు. గతంలో ఆయన రెండు సార్లు ఎంపీగా పనిచేశారు. వీరితో పాటు అనేక మంది సిట్టింగ్‌ ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల కుమారులు ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దీంతో ఆయా అసెంబ్లీ స్థానాల పోరు ఆసక్తికరంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని