Sukhwinder Sukhu: నాడు పాల విక్రేత.. నేడు సీఎం!

మొదట్లో.. సాధారణ జీవనమే. తండ్రి.. రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్‌. తానూ ఒకప్పుడు పాలు విక్రయించాడు. ఇప్పుడు రాష్ట్రాన్నే పాలించనున్నాడు. ఆయనే.. హిమాచల్‌ ప్రదేశ్‌(Himachal Pradesh) నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు(Sukhwinder Sukhu). సీఎంగా ఆయన పేరును కాంగ్రెస్‌ పార్టీ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే.

Published : 11 Dec 2022 01:27 IST

శిమ్లా: మొదట్లో.. సాధారణ జీవనమే. తండ్రి.. రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్‌. తానూ ఒకప్పుడు పాలు విక్రయించాడు. ఇప్పుడు రాష్ట్రాన్నే పాలించనున్నాడు. ఆయనే.. హిమాచల్‌ ప్రదేశ్‌(Himachal Pradesh) నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు(Sukhwinder Sukhu). సీఎంగా ఆయన పేరును కాంగ్రెస్‌ పార్టీ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. భాజపాకు చెందిన ప్రేమ్ కుమార్ ధుమాల్ తర్వాత.. హమీర్‌పూర్ జిల్లా నుంచి ఆయన రెండో ముఖ్యమంత్రి కానున్నారు. మొత్తంగా చూస్తే.. రాష్ట్రానికి ఏడో సీఎం.

ఎస్‌ఎస్‌ సుఖు.. దిగువ హిమాచల్‌కు చెందిన కాంగ్రెస్‌ నేత. పార్టీతో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. 1980ల్లో ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి రాజకీయాలనుంచి యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడిగా.. ఇలా అంచెలంచెలుగా ఎదిగి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. 2003లో తొలిసారి మొదలు.. నాదౌన్ అసెంబ్లీ స్థానం నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు గెలుపొందారు. 58 ఏళ్ల సుఖుకు రాహుల్‌ గాంధీకి సన్నిహితుడిగా పేరుంది. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించి.. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.

వృత్తిరీత్యా న్యాయవాది అయిన సుఖు.. హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ నుంచి ఎంఏ, ఎల్‌ఎల్‌బీ చదివారు. రెండుసార్లు శిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. వర్సిటీ రాజకీయాల్లో దూకుడు కారణంగా.. ఆయనకు ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు ఉంది. 2013 నుంచి 2019 మధ్య రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న సమయంలో.. పార్టీని బలోపేతం చేశారు. ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిందని రాజకీయ ప్రముఖులు విశ్లేషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని