Jharkhand Crisis: ఝార్ఖండ్‌ రాజకీయ సంక్షోభం.. మొదలైన ఎమ్మెల్యేల తరలింపు..

ఝార్ఖండ్‌లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఊగిసలాటలో ఉంది. సీఎం శాసనసభ్యత్వంపై అనర్హత వేటుకు

Updated : 27 Aug 2022 16:06 IST

రాంచీ: ఝార్ఖండ్‌లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఊగిసలాటలో ఉంది. సీఎం శాసనసభ్యత్వంపై అనర్హత వేటుకు గవర్నర్‌ నిర్ణయం తీసుకుంటే.. ప్రభుత్వం కూలకుండా ఉండేందుకు సోరెన్‌ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ప్రత్యర్థుల బేరసారాల నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారిని ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారు.

శుక్రవారం సాయంత్రమే సోరెన్‌ నివాసం వద్ద రెండు బస్సులు కనిపించాయి. ఈ ఉదయం ఎమ్మెల్యేలంతా బ్యాగులు సర్దుకుని సీఎం నివాసానికి వచ్చారు. ఈ మధ్యాహ్నం సంకీర్ణ ఎమ్మెల్యేలు బస్సుల్లో సోరెన్‌ ఇంటి నుంచి బయల్దేరారు. వీరిని కుంతీ జిల్లాకు తరలిస్తున్నట్లు సమాచారం. అక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్‌ లేదా బెంగాల్‌కు ఎమ్మెల్యేలను పంపించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

81 మంది సభ్యులున్న ఝార్ఖండ్‌ అసెంబ్లీలో సోరెన్‌ సర్కారుకు 49 మంది సంఖ్యాబలం ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలో  30 మంది ఎమ్మెల్యేలతో ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా అతిపెద్ద పార్టీగా ఉండగా.. కాంగ్రెస్‌కు 18 మంది, ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. భాజపాకు 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ సోరెన్‌పై అనర్హత వేటు పడితే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే మధ్యంతర ఎన్నికలు పెట్టాలని భాజపా నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సంకీర్ణ ప్రభుత్వం ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది.

సీఎంగా ఉంటూ గనుల లీజును సోరెన్‌.. తనకు తానే కేటాయించుకోవడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 9-ఏకు విరుద్ధమంటూ ప్రతిపక్ష భాజపా.. రాజ్‌భవన్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై గవర్నర్‌ రమేశ్‌ బైస్‌.. ఎన్నికల సంఘం (ఈసీ) అభిప్రాయాన్ని కోరారు. ఈసీ కూడా తన అభిప్రాయాన్ని గురువారం సీల్డ్‌కవర్‌లో గవర్నర్‌కు పంపింది. దీనిపై గవర్నర్‌ శనివారం నిర్ణయం తీసుకునే అవకాశముంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని