ఏపీలో పరిషత్‌ ఎన్నికల తేదీలివే

ఏపీలో పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం  ప్రకటించింది..

Updated : 02 Apr 2021 14:51 IST

అమరావతి: ఏపీలో పరిషత్‌ ఎన్నికల షెడ్యూల్‌‌ విడుదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం  ప్రకటించింది. ఈనెల 8న పోలింగ్‌ నిర్వహించి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అవసరమైన చోట 9న రీపోలింగ్‌ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 33,663 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 2 కోట్ల 82 లక్షల 15వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

గతేడాది రాష్ట్రంలోని 660 జడ్పీటీసీలకు గానూ 652 స్థానాలకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో126 జడ్పీటీసీలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 526  స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా చోట్ల మొత్తం 2092 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  మరోవైపు రాష్ట్రంలో 10,047 ఎంపీటీసీ స్థానాలుండగా.. విభజన, కోర్టు కేసులతో 354 ఎంపీటీసీలకు ఎన్నికలు నిలిచిపోయాయి. అనంతరం 2,371 స్థానాలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 7,322 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ ఎన్నికల బరిలో మొత్తం 19,002 మంది అభ్యర్థులు నిలిచారు.

గతేడాది మార్చిలో మార్చిలో పరిషత్‌ ఎన్నికలను ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తూ ఎస్‌ఈసీ నీలం సాహ్ని నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ ఆగిన చోటే తిరిగి ప్రారంభించనున్నట్లు  పేర్కొన్నారు.

నీలం సాహ్ని ఈరోజే నూతన ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాత్రి పరిషత్‌ ఎన్నికల కొత్త తేదీలను ఎస్‌ఈసీ ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని