
Ts News: రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అమలు చేయాల్సిందే: బండి సంజయ్
కరీంనగర్: ఎట్టి పరిస్థితుల్లో రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ‘దళితబంధు’ అమలు చేయాల్సిందేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ... ఎన్నికల కోడ్ సాకుగా చూపి దళితబంధు ఆపేశారని, ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ రేపటి నుంచి సీఎం అమలు చేయాల్సిందేనన్నారు.
‘‘ఉప ఎన్నిక సందర్భంగా సీఎం, తెరాస నేతలు వ్యవహరించిన తీరు చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఓటుకు రూ.6వేల చొప్పున పంపిణీ చేశారు. ధన ప్రలోభాలతో గెలవాలని చూశారు. తెరాస గెలిస్తే హుజూరాబాద్ ప్రజలకు అవమానకర పరిస్థితి తలెత్తేది. అందుకే .. మా ఓట్లను డబ్బులతో కొంటారా? అని హుజూరాబాద్ ప్రజలు ఆలోచించారు. వారి విజ్ఞతకు చేతులెత్తి మొక్కాలి. సీఎం, మంత్రులు ఎన్నో అబద్ధాలు చెప్పారు.. ఏకంగా అబద్ధాలకే ఓ శాఖను ఏర్పాటు చేశారు. తెరాస అబద్ధాలను, జిమ్మిక్కులను ప్రజలు నమ్మలేదు. హుజూరాబాద్ ప్రజలకు ఈటల అండగా ఉన్న వ్యక్తి. మంత్రిగా, ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఈటల గెలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఉద్యమకారుడిగా ఈటలకు గుర్తింపు ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు భాజపా రుణపడి ఉంటుంది’’ అని బండి సంజయ్ అన్నారు.